శశికళ ఎవరు ? పోయెస్ గార్డెన్ లో ఎందుకు పోలీసులు: స్టాలిన్
చెన్నై: అధికారంలో ఉన్నాం కదా అని ఏమీ చేసినా చెల్లిపోతుందనే తీరుతో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే పార్టీ కోశాధికారి ఎంకే. స్టాలిన్ మండిపడ్డారు.
శనివారం ఆయన చెన్నైలో మాట్లాడుతూ తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేస్తూ జయలలిత అనారోగ్యంతో ఇదే నెల మొదటి వారంలో మరణించారని గుర్తు చేశారు. ఆమె అధికారంలో ఉన్న సమయంలో జయలలిత ఇంటి దగ్గర (పోయెస్ గార్డెన్) కట్టుదిట్టమైన భద్రత ఉండేదని అన్నారు.
ముఖ్యమంత్రిగా, అన్నాడీఎంకే పార్టీ చీఫ్ గా జయలలితకు భద్రత కల్పించడం పోలీసుల బాధ్యత అని చెప్పారు. అయితే జయలలిత మరణించిన తరువాత పోయెస్ గార్డెన్ దగ్గర 240 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఎందుకు భద్రత కల్పిస్తున్నారు ? అని స్టాలిన్ ప్రశ్నించారు.
జయలలిత మరణించిన తరువాత ఆమె నెచ్చెలి శశికళ పోయెస్ గార్డెన్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే శశికళకు ఏం అధికారం ఉంది ? ఆమె ఏమైనా ప్రజాప్రతినిధినా ? ఎందుకు జయలలిత లేకపోయినా పోయెస్ గార్డెన్ దగ్గర పోలీసుల భద్రత ఉంది ? అని స్టాలిన్ ప్రశ్నించారు.
ఇదే సమయంలో అధికార పార్టీ అన్నాడీఎంకే మీద స్టాలిన్ విరుచుకుపడ్డారు. ప్రజలను రక్షించడానికి, వారి సమస్యలు పరిష్కరించడానికి పోలీసులు ఉంటారని, అంతే కాని ఇలా ఎవరికిపడితే వారికి భద్రత కల్పించడానికి కాదని స్టాలిన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.