డీఎంకే మ్యానిఫెస్టో రిలీజ్- పెట్రో ధరల తగ్గింపు, గుళ్లకు నిధులు- ప్రశాంత్ కిషోర్ మార్క్
తమిళనాడులో వచ్చే నెల 6న జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం డీఎంకే మ్యానిఫెస్టోను విడుదల చేసింది. పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ ఇవాళ చెన్నైలో మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో పలు కీలక హామీలకు చోటు లభించింది. డీఎంకే ఎప్పటినుంచో చెబుతున్న పెట్రో ధరల తగ్గింపును చేర్చారు. దీంతో పాటు మహిళలకు మాతృత్వ సెలవుల పెంపు, గుళ్లకు భారీగా నిధుల కేటాయింపు వంటి అంశాలకూ చోటిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉన్న డీఎంకే మ్యానిఫెస్టోలో భాగంగా ఓటర్లకు ఇస్తున్న హామీల వెనుక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉన్నారు.

డీఎంకే మ్యానిఫెస్టో విడుదల
తమిళనాడులో వచ్చే నెల 6న ఒకే విడతలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం డీఎంకే సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను నిన్న విడుదల చేసిన పార్టీ అధినేత ఎంకే స్టాలిన్.. ఇవాళ మ్యానిపెస్టోను కూడా ప్రకటించారు. ఇందులో పలు కీలక అంశాలకు చోటు లభించింది. వచ్చే ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునే పలు సంక్షేమ అంశాలను మ్యానిపెస్టోలో చేర్చారు. డీఎంకే మ్యానిఫెస్టోలో మొత్తం 500 హామీలు ఇచ్చారు. మధ్యతరగతి, పేదలకు ఊరట కల్పించే ఎన్నో హామీలు ఇందులో ఉన్నాయి. రాష్ట్రంలో ఉద్యోగులు, భక్తులు, మధ్యతరగతి ప్రజలు అందరికీ ఏదో ఒక హామీతో లబ్ది చేకూర్చేలా ఈ మ్యానిఫెస్టో ఉంది.

డీఎంకే మ్యానిఫెస్టోలో కీలక అంశాలివే
డీఎంకే మ్యానిఫెస్టోలో మొత్తం 500 హామీలు ఇచ్చినా వాటిలో ప్రధానమైనవి కొన్ని ఉన్నాయి. వీటిలో పెట్రోల్, డీజిల్, పాల ధరల్ని తగ్గించడం, రేషన్ కార్డు దారులకు రూ.4 వేలు సాయం, రైతులకు మోటార్లు కొనుక్కునేందుకు రూ.10 వేల సాయం, ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధులకు ట్యాబ్లెట్ పీసీలు, ఉచిత డేటా, మహిళలకు ఏడాది మాతృత్వసెలవు, నీట్ పరీక్ష ఎత్తేయడం, గ్యాస్ సిలెండర్లపై రూ.100 రాయితీ, అమ్మ క్యాంటీన్ల తరహాలో 500 కలైంజర్ ఫుడ్ స్టాళ్లు, ట్రిచీ, మధురై, సాలెం, నెల్లాయ్, కోయంబత్తూర్కు మెట్రో రైళ్లు, 30 ఏళ్ల లోపు విద్యార్ధుల రుణాల రద్దు, ఎన్నికల హామీల అమలుకు ప్రత్యేక మంత్విత్వశాఖ ఏర్పాటు వంటివి ఉన్నాయి.

జగన్ బాటలోనే స్టాలిన్
డీఎంకే తాజాగా ప్రకటించి ఎన్నికల ప్రణాళికలో ఏపీ సీఎం జగన్ బాటలోనే డీఎంకే అధినేత స్టాలిన్ కూడా పయనించినట్లు తెలుస్తోంది. ఏపీలో ఇప్పటికే అమలు చేస్తున్న పరిశ్రమల్లో స్ధానికులకు 75 శాతం కోటా తరహాలోనే తమిళనాడులోనూ 75 శాతం కోటా ఇస్తామని డీఎంకే ప్రకటించింది. వీధుల్లో తిరిగే వారి కోసం నైట్షెల్టర్ల ఏర్పాటు, అలాగే అసెంబ్లీ ప్రసారాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని కూడా డీఎంకే మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. మిగతా రాష్ట్రాల్లో అమల్లో ఉన్న అసెంబ్లీ లైవ్ తమిళనాడులో మాత్రం ఇప్పటివరకూ లేదు. దీంతో చట్టసభల నిర్ణయాలు ప్రజలు నేరుగా తిలకించేందుకు, పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టాలిన్ తెలిపారు.

తొలిసారి గుళ్లు, ప్రార్ధనామందిరాలకు భారీగా నిధులు
డీఎంకే మ్యానిఫెస్టోలో తొలిసారిగా ఓ కీలకమైన హామీకి చోటు దక్కింది. ఇప్పుటివరకూ నాస్తిక వాదుల పార్టీగా ముద్ర ఉన్న డీఎంకే తొలిసారిగా గుళ్లు, చర్చిలు, మసీదుల అభివృద్ధికి నిధులు ఇస్తామని ప్రకటించింది. తమిళనాడులో ప్రార్ధానమందిరాలు, గుళ్ల సంఖ్య ఎక్కువే. దీన్ని దృష్టిలో ఉంచుకుని తొలిసారి గుళ్లకు రూ.1000 కోట్లు, చర్చిలు, మసీదులకు రూ.200 కోట్లు ఇస్తామని డీఎంకే హమీ ఇచ్చింది. అన్నాడీఎంకేతో జతకలిసిన బీజేపీ జనంలోకి హిందూత్వ అజెండాతో వెళ్తున్న నేపథ్యంలో డీఎంకే మ్యానిపెస్టోలో ఇచ్చిన ఈ హామీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

డీఎంకే మ్యానిపెస్టోపై ప్రశాంత్ కిషోర్ మార్క్
గతంలో ఏపీలో వైసీపీ తరఫున వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్.. జగన్ వ్యూహాల్లో కీలకపాత్ర పోషించారు. ఎన్నికల అజెండాతో పాటు హామీల విషయంలోనూ జగన్ ప్రశాంత్ కిషోర్కు ఇచ్చిన సూచనలు బాగా పనిచేశాయి. అంతిమంగా ఓటర్లను కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో 2019లో వైసీపీ 151 సీట్లతో భారీ విజయం అందుకుంది. ఇప్పుడు డీఎంకే తరఫున కూడా వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్.. మ్యానిఫెస్టో, అభ్యర్ధుల ఎంపికపైనా తన మార్క్ చూపారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఎన్నికల హామీలు విశ్వసనీయంగా ఉండేలా తీసుకున్న జాగ్రత్తలు, వాటి అమలుకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేస్తానన్న హామి కూడా్ ఇందులో భాగమేనని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications