పట్టపగలే దారుణం: ప్రేమించలేదని కత్తితో పొడిచాడు
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలోని నుంగంబక్కమ్లో పట్టపగలే దారుణం జరిగింది. తనను ప్రేమించేందుకు నిరాకరించిందని కోపం పెంచుకున్న ఓ యువకుడు ఆ యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దారుణ ఘటన సోమవారం ఉదయం 11 గంటలకు నుంగంబక్కమ్లోని రూట్లండ్ గేట్ రోడ్లో జరిగింది. స్థానికులు వెంటనే ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు పి లక్ష్మి(23) తన తల్లిదండ్రులతో కలిసి అమింజికరాయ్లో నివాసం ఉంటోంది. ఆమె నుంగంబక్కమ్లో ఇంటిరియర్ డిజైన్ సంస్థలో విధులు నిర్వహిస్తోంది. కాగా, గత కొంత కాలంగా ఆమెను శరవణన్(25) అనే యువకుడి ప్రేమిస్తున్నానంటూ వెంట పడుతున్నాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతనితో ఇంకెప్పుడు ఆమెను వేధింపులకు గురి చేయనని హామి ఇప్పించారు.
తన వైఖరి మార్చుకోని శరవణన్ మళ్లీ ఆ యువతి వెంట పడుతూనే ఉన్నాడు. సోమవారం కూడా ఆమె విధులు వెళుతున్న సమయంలో అడ్డగించాడు. ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆమె కూడా అతన్ని ప్రేమించాలని ఒత్తడి చేశాడు. అయితే అందుకు ఆమె అంగీకరించలేదు.
ఆగ్రహానికి గురైన శరవణన్.. తన వద్ద ఉన్న కత్తిని తీసి ఆమెను విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలై అక్కడే కుప్పకూలిపోయింది. అటుగా వెళ్తున్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని.. ఆమెను దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వారు వచ్చేలోపే నిందితుడు బైకుపై పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడు శరవణన్ కోసం గాలిస్తున్నారు.