శ్రావణ సోమవారం శివాలయంలో తొక్కిసలాట..పలువురు మృతి, 40మందికి గాయాలు!
ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నిన్న హరిద్వార్ లోని మానస దేవి ఆలయంలో తొక్కిసలాట ఘటన మరిచిపోకముందే మరొక దారుణ ఘటన చోటుచేసుకుంది. నిన్న హరిద్వార్ లోని మానస దేవి ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది. ఆరుగురు ప్రాణాలు కోల్పోగా 25 మంది గాయపడ్డారు.
బారాబంకి లో పురాతన ఔసానేశ్వర్ మహాదేవ్ ఆలయంలో తొక్కిసలాట
ఇక తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకి లో పురాతన ఔసానేశ్వర్ మహాదేవ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన శ్రావణ సోమవారం సందర్భంగా నేడు చోటుచేసుకుంది. బారాబంకి లోని ఔసానేశ్వర్ మహాదేవ్ ఆలయానికి ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసి పోయిన సమయంలో ఆలయం వద్ద ఉన్న విద్యుత్ తీగలు తెగి భక్తులపై పడ్డాయి.

తెగిపడిన కరెంట్ తీగలు.. ఇద్దరు మృతి, 40మందికి గాయాలు
దీంతో కొంతమంది విద్యుత్ ఘాతానికి గురి కాగా, కరెంటు తీగలు తెగి పడ్డాయని తెలిసిన భక్తులు కొందరు ఆందోళనకు గురై ఒక్కసారిగా పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, 40 మందికి పైగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. దాదాపు 19 మంది కరెంట్ షాక్ కు గురయ్యారని వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు.
శ్రావణ సోమవారం వేళ దారుణ ఘటన
గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా తెలిపారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని పోలీసులు కంట్రోల్లోకి తీసుకువచ్చారు. శ్రావణ సోమవారం కావడంతో పురాతన శివాలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.
నిన్న విద్యుత్ తీగలు తెగి పడ్డాయని పుకారుతో తొక్కిసలాట, నేడు నిజంగానే
ఇదిలా ఉంటే నిన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ మానసా దేవి ఆలయంలో కూడా తొక్కిసలాట ఘటన జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇక నేడు ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. హరిద్వార్ మానసా దేవి ఆలయం వద్ద కూడా విద్యుత్ తీగలు తెగి పడ్డాయని పుకారు చెలరేగడంతో ఒకసారిగా భక్తులు పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు ప్రాణాలను కోల్పోయారు.












Click it and Unblock the Notifications