ఆడవాళ్లను 14 సెకన్లు చూస్తే అంతే..
కొచ్చి : ఆకతాయి వేశాలకు నేత్రానందం అనే ఓ ట్యాగ్ లైన్. కాలేజీలు, బస్టాప్ లు, ఎక్కడైనా సరే.. ఆడవాళ్లను చూపులతో గుచ్చి గుచ్చి చంపే మగాళ్లకు కొదువలేదు. అయితే.. అలాంటి వాళ్లంతా ఇకనుంచి తమ ప్రవర్తన మార్చుకుంటే మంచిది. లేదంటే.. పోలీసుల చేతిలో అడ్డంగా బుక్కయి పోవడం ఖాయం. ఎందుకంటారా..?
14 సెకన్ల పాటు ఆడవాళ్లను అదే పనిగా చూసే వాళ్లపై కేసు పెట్టవచ్చునని చెబుతున్నారు కేరళ ఎక్సయిజ్ కమిషనర్ రిషిరాజ్ సింగ్. స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు దేశమంతటా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆకతాయి వేశాలు వేసేవాళ్ల నుంచి, దుర్మార్గుల నుంచి ఎలా తప్పించుకోవాలో విద్యార్థినులకు పలు చిట్కాలు చెప్పిన ఆయన, హద్దు దాటి రెచ్చిపోయే వాళ్లకు చట్ట పరిధిలో ఎలాంటి శిక్షలు ఉంటాయో వివరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 14 సెకన్ల పాటు ఎవరైతే మహిళలను తదేకంగా చూస్తారో వాళ్లపై కేసు నమోదు చేయవచ్చునని, అయితే ఇంతవరకు దేశంలో అలాంటి కేసులు ఎక్కడా నమోదు కాలేదని చెప్పారు రిషిరాజ్. అసభ్యంగా ప్రవర్తించినా.. అమర్యాదకరంగా మాట్లాడినా.. వెంబడించినా.. సదరు వ్యక్తులపై కేసు పెట్టవచ్చునని ఆయన తెలిపారు. ఇలాంటి వారి బారి నుంచి తప్పించుకునేందుకు అమ్మాయిలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని చెప్పుకొచ్చారు.
రిషిరాజ్ సలహాపై సెటైర్లు..
రిషిరాజ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై సెటైర్లు వేసేవారు లేకపోలేదు. దీనిపై స్పందించిన కేరళ క్రీడల మంత్రి జయరాజన్.. చట్టంలో ఏ అంశాలు పొందుపర్చారో రిషిరాజ్ తెలుసుకుంటే మంచిదని సూచించారు. 14 సెకన్ల పాటు చూస్తే కేసు పెట్టవచ్చునని చెప్పడం ఏవిధంగా సరైందో తెలియడం లేదని, ఒకవేళ నల్ల కళ్లద్దాలు పెట్టుకుని చూస్తే ఎలా గుర్తిస్తారని వ్యంగ్యమైన కామెంట్స్ చేశారు జయారజన్.