మీరేం చేస్తున్నారు, దాడులు జరగకుండా రాష్ట్రాలే చూడాలి: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: గోసంరక్షణ పేరిట దాడులు చెయ్యడం ఆమోదయోగ్యం కాదని, ఇలాంటి దాడులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాలదేనని సుప్రీం కోర్టు మంగళవారం అభిప్రాయం పడింది. గోసంరక్షణ దాడులు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై మార్గదర్శకాలను జారీ చేయాల్సిందిగా వేసిన పిటిషన్లని విచారించింది.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించి దీనికి సంబంధించిన తీర్పును రిజర్వ్లో పెట్టింది. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదని హెచ్చరించింది. అంతేకాకుండా ఈ దాడిలో గాయపడిన వారిని బాధితులగా పరిగణించాలని, వారిని కుల, మత ప్రాతిపదికన చూడరాదని పేర్కొంది.
చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని, గోసంరక్షణ పేరిట ఇతరులపై దాడి సరికాదని, ఆ బాధ్యత రాష్ట్రాలదే అన్నారు. ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు.
దీంతో పాటు ఈ దాడులు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకునేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా నోడల్ అధికారులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.