సీఏఏ అమలును ఆపలేవు: రాష్ట్రాల తీర్మానాలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
పార్లమెంటులో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలును నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యాణించారు. సీఏఏకి మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించిన 'జన జాగరణ్ అభియాన్' కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్న సందర్భంగా కేంద్రమంత్రి ప్రసగించారు.

సీఏఏను ఆపలేవు..
కేరళ సహా పలు రాష్ట్రాలు సీఏఏని అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. సీఏఏని అమలు చేయబోమంటూ రాష్ట్రాలు తీర్మానం చేయవచ్చు.. కానీ, అది కేవలం ఓ రాజకీయ ప్రకటన మాత్రమే అని అన్నారు. అవి పౌరసత్వ సవరణ చట్టం అమలును ఆపలేవని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

సీఏఏ అమలు అందరి బాధ్యత..
పార్లమెంటులో ఆమోదం పొందిన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి ఒక్కరిపైనా ఉందని సీతారామన్ తేల్చి చెప్పారు. కాగా, గత ఆరేళ్లలో 2,838 పాకిస్థానీలకు, 914 మంది ఆఫ్ఘనిస్థానీలకు, 172 మంది బంగ్లాదేశీ శరణార్థులకు భారత పౌరసత్వం ఇచ్చామని మంత్రి తెలిపారు. వీరిలో పలువురు ముస్లింలు కూడా ఉన్నారని తెలిపారు. 1964-2008 వరకు శ్రీలంక నుంచి వచ్చిన తమిళులకు భారత పౌరసత్వం ఇవ్వడం జరిగిందని వివరించారు. 2016-18లో మోడీ ప్రభుత్వ హయాంలో 1595 మంది పాకిస్థానీ వలసదారులకు, 391 మంది ఆఫ్ఘనిస్థానీ వలసదారులకు భారత పౌరసత్వం ఇచ్చామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

కపిల్ సిబల్ కూడా అదే మాట..
ఇది ఇలావుంటే, తాజాగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ కూడా నిర్మల్ సీతారామన్ చేసిన వ్యాఖ్యలనే చేశారు. సీఏఏ అమలును రాస్ట్రాలు అడ్డుకోలేవని కపిల్ సిబల్ కూడా స్పష్టం చేశారు. కాగా, కేరళ, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు తమ రాష్ట్రంలో సీఏఏను అమలు చేయబోమని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చట్టంపై కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. స్వేచ్ఛా, సమానత్వం వంటి ప్రాథమిక హక్కులను భంగం ఇది కలిగించడమేనని, లౌకికవాదానికి వ్యతిరేకమని కేరళ సర్కారు తన ప్రటిషన్ లో పేర్కొంది.












Click it and Unblock the Notifications