బక్రీద్ సందర్భంగా కశ్మీర్లో కల్లోలం... పోలీసును కాల్చి చంపిన ఉగ్రవాదులు
జమ్మూ కశ్మీర్ : కశ్మీర్లో మరోసారి కల్లోలం జరిగింది. బక్రీద్ పండగ సందర్భంగా ఈ అల్లర్లు చోటుచేసుకున్నాయి. శ్రీనగర్లో బక్రీద్ సందర్భంగా ప్రార్థనల అనంతరం కొందరు రోడ్లపైకొచ్చి పాకిస్తాన్ జెండాలను ఊపుతూ హడావిడి చేశారు. అంతేకాదు మరికొందరు ఐసిస్ జెండాలను చేతపట్టుకుని పరుగులు తీశారు. కనిపించిన వారిపైకి రాళ్లు రువ్వారు. ఇంతటితో వారు ఆగలేదు. పోలీసులపైకి రాళ్లు రువ్వి అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న శ్రీనగర్లో శాంతి విఘాతానికి పాల్పడ్డారు.
ఈద్ సందర్భంగా ప్రార్థనలు ముగించుకుని రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను నిలువరించే క్రమంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ ఆందోళనకారుల మధ్యే ఉగ్రవాదులు కూడా ఉన్నారు. వారిని కూడా ఆందోళనకారులుగానే పోలీసులు భావించారు. వారు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో ఓ పోలీసు మృతి చెందాడు. ఈ అల్లర్లు వివిధ ప్రాంతాల్లో ఒక్కసారే జరిగాయి. అన్ని చోట్ల మసీదులో ప్రార్థనలు ముగిశాకే అల్లర్లు ప్రారంభమయ్యాయి. పోలీసును ఉగ్రవాదులు కాల్చి చంపిన ఘటన కుల్గాం జజ్రీపురాలో చోటుచేసుకుంది. ఈద్ సందర్భంగా ఆ పోలీసు ప్రార్థనలు ముగించుకుని వెళుతుండగా ఉగ్రవాదులు ఆయన్ను కాల్చి చంపారు.
కశ్మీర్లో ఈ ఏడాది మేలో ఆందోళనకారులు రాళ్లు రువ్విన ఘటనలో తమిళనాడుకు చెందిన పర్యాటకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజులకే బెంగళూరుకు చెందిన డిస్ట్రిక్ట్ జడ్జి తన కుటుంబంతో కశ్మీర్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఆయన ప్రయాణిస్తున్న కారుపై కూడా కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. షోపియన్ జిల్లాలో చిన్న పిల్లలను తీసుకెళుతున్న స్కూలు బస్సుపై కూడా దుండగులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో చిన్నారులకు గాయాలయ్యాయి. కొందరు భయంతో బస్సు సీట్ల కింద దాక్కున్నారు. ఈ ఘటనను రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఖండిస్తూనే... భద్రతాబలగాలు ఉగ్రవాదులపై కఠినంగా వ్యవహరించకపోతే కశ్మీర్లో పరిస్థితులు సాధారణ స్థితికి రావని ఆమె వ్యాఖ్యానించారు. కేవలం భద్రతాబలగాలపై నెపం నెట్టడం సరికాదన్నారు.