ఫేస్బుక్ వాడనివ్వలేదని అమ్మాయి ఆత్మహత్య
పోలీసులు తెలిపిన ప్రకారం.. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పర్భానిలోని నానల్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బుధవారం రాత్రి ఐశ్వర్య ఎస్ దహివాలా అనే 17ఏళ్ల యువతి తన తల్లిదండ్రులతో ఫేస్బుక్ వినియోగం విషయమై గొడవ పడింది. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లను, మొబైల్ చాటింగ్లను ఎక్కువగా ఉపయోగించకూడదని ఐశ్వర్యను తన తల్లిదండ్రులు పలుమార్లు హెచ్చరించినట్లు తెలిసింది.
అందరి తల్లిదండ్రుల్లాగే ఆలోచించిన ఐశ్వర్య తల్లిదండ్రులు తమ కూతురు ఫేస్బుక్, మొబైల్ ఫోన్ల వల్ల తప్పుదోవ పట్టే అవకాశం ఉందని వారు ఆమెను మందలించేవారని తెలిసింది. మొబైల్, సైట్లపై కాకుండా తన దృష్టి చదువుపై కొనసాగించాలని ఐశ్వర్యకు ఆమె తల్లిదండ్రులు సూచించారు.
బుధవారం రాత్రి తల్లిదండ్రులతో గొడవపడిన తర్వాత తన గదిలోకి వెళ్లిన ఐశ్వర్య సూసైట్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు విచారాణాధికారి లెంగూడే తెలిపారు. తనను ఫేస్బుక్ ఉపయోగించకుండ తన తల్లిదండ్రులు ఎప్పుడూ అడ్డు చెప్పేవారని, ఫేస్బుక్ అంత చెడ్డదా? అని ప్రశ్నించిన ఐశ్వర్య.. తనపై ఇలాంటి ఆంక్షలు పెట్టే ఇంట్లో ఉండలేనని, ఫేస్బుక్ లేకుండా జీవించలేనని ఐశ్వర్య తన సూసైట్ నోట్లో పేర్కొనడం గమనార్హం. ఐశ్వర్య ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు, తన ఇద్దరు సోదరులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.