బౌబౌ బిరియాని చేస్తున్న విద్యార్థులు: అరెస్టు
బెంగళూరు: కుక్కను చంపి బిరియాని చేస్తున్న ముగ్గురు మణిపూర్ విద్యార్థులను బెంగళూరులోని కేఆర్ పురం పోలీసులు అరెస్టు చేశారు. మణిపూర్ కు చెందిన మైకెల్ (27), డాల్జిత్ (26), రోమెన్ (27) అనే ముగ్గురిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని శనివారం పోలీసులు చెప్పారు.
వీరు ముగ్గురు బెంగళూరు చేరుకుని బెంగళూరు-పాత మద్రాసు రోడ్డులోని భట్టరహళ్ళిలో నివాసం ఉంటున్నారు. డాల్జిత్, రోమెన్ ఇద్దరు సోదరులు. మైకెల్, డాల్జిత్ ఇందిరానగరలో యానిమేషన్ విద్యాభ్యాసం చేస్తున్నారు. రోమెన్ కేఆర్ పురంలోని ప్రయివేటు కాలేజ్ లో బీసీఏ విద్యాభ్యాసం చేస్తున్నాడు.
ఈ ముగ్గురు అద్దె ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నారు. వీరు ఇంటిలో 10 నెలల పెంపుడు కుక్కను పెంచుకుంటున్నారు. మూడు రోజుల క్రితం ఇంటిలో కుక్కను చంపేశారు. తరువాత చర్మం తీసి కుక్క మాంసం స్టౌ మీద పెట్టి బిరియాని చేస్తున్నారు.
ఆ సమయంలో దుర్వాసన రావడంతో పక్కింటిలో నివాసం ఉంటున్న ఇంకోక విద్యార్థి స్రింజాయ్ కి అనుమానం వచ్చి కిటికిలో చూశాడు. ఇంటిలో కుక్క చర్మం, మాంసం ముక్కలు పడి ఉండటం చూసి వెంటనే మొబైల్ లో ఫోటోలు తీశాడు.
తరువాత ఆ ఫోటోలు ఫేస్ బుక్ లో షేర్ చేశాడు. జంతు సంరక్షణ స్వచ్చంద సంస్థల ప్రతినిధులకు పంపించాడు. ఆ సందర్బంలో అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న రాజుగౌడ అనే వ్యక్తి మొబైల్ కు ఫోటోలు వెళ్లాయి. అతను కేఆర్ పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు మణిపురకు చెందిన ముగ్గురు విద్యార్థులను అరెస్టు చేసి తీసుకు వెళ్లారు. కుక్క చర్మం, మాంసం ముక్కలను ప్రయోగశాలకు పంపించారు. ఈ పరిసర ప్రాంతాలలో నివాసం ఉంటున్న మణిపుర విద్యార్థులు పెంపుడు కుక్కలను చంపి బౌబౌ బిరియాని చేసుకుని తినేస్తున్నారని స్థానికులు ఆరోపించారు.