Subhash Chandra: సుభాష్ చంద్రకు బిగ్ షాక్- దేశవ్యాప్త విమర్శలతో NCLT యూటర్న్..!
భారీ ఎత్తున అప్పుల పాలై, రుణదాతలకు 22 వేల కోట్లు చెల్లించాల్సిన నేపథ్యంలో దివాళా తీసినట్లు ప్రకటించి జాతీయ కంపెనీ చట్టాల ట్రైబ్యుునల్ ద్వారా కేవలం 6.25 కోట్లు మాత్రమే చెల్లించి తప్పించుకుందామనుకున్న ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర (Subhash Chandra) ఎత్తులు పారలేదు. సుభాష్ చంద్రకు సంబంధించిన దివాలా కేసులో ఎన్సీఎల్టీ ఆగస్టు 25న ఈ మేరకు ఇచ్చిన ఉత్తర్వుపై యూటర్న్ తీసుకుంది. గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వుపై వారం రోజుల్లోపే స్టే విధించింది. అలాగే హామీదారుగా ఉన్న ఆయన.. తన ఆస్తులను ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ బదిలీ చేయకూడదని కూడా ఆదేశాలు ఇచ్చింది.
ఎస్సెల్ గ్రూప్ తరఫున తీసుకున్న రుణాలు, రుణ హామీలకు సంబంధించి గ్యారంటీర్ గా ఉన్న సుభాష్ చంద్ర చెల్లించాల్సిన 22 వేల కోట్లకు బదులుగా దివాళా ప్రక్రియ కింద రూ.6.5 కోట్లు చెల్లిస్తే సరిపోతుందని ఎన్టీఎల్టీ సంచలన తీర్పు ఇచ్చింది. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో ఈ కేసును విచారిస్తున్న ముగ్గురు సభ్యులు ఇచ్చిన ఉత్తర్వులలో భేదాభిప్రాయాలు తలెత్తాయి. దీంతో ఈ వ్యవహారం కాస్తా ఇప్పుడు ఐదుగురు సభ్యులతో కూడిన ఎన్సీఎల్టీ ప్రత్యేక ధర్మాసనం ముందుకు వచ్చింది. దీనిపై ఇవాళ విచారణ ప్రారంభించిన ప్రత్యేక ధర్మాసనం, గతంలో ఇచ్చిన ఉత్తర్వులలో భేదాభిప్రాయాలు ఉన్నాయని, అమలు చేయడానికి వీలైన స్పష్టమైన మెజారిటీ అభిప్రాయం ఏదీ లేదని తేల్చేసింది.

ఈ నేపథ్యంలో సుభాష్ చంద్రకు సంబంధించిన ఈ కేసులోని అన్ని పార్టీలకు ట్రైబ్యునల్ ఇవాళ నోటీసులు కూడా జారీ చేసింది. సుభాష్ చంద్రపై 22 వేల కోట్లకు పైగా బకాయి క్లెయిమ్ లు ఉన్నా.. 6.25 కోట్లు మాత్రమే చెల్లించి తన దివాలా ప్రక్రియను పరిష్కరించుకోవడానికి ఎన్సీఎల్టీ ఉత్తర్వు మార్గం సుగమం చేసిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటు చేసుకోవడం చర్చనీయాంశమవుతోంది. గతంలో అంగీకరించిన క్లెయిమ్లను ఇంత తక్కువ మొత్తానికి ఎలా పరిష్కరించగలరనే దానిపై తంలో ఎన్సీఎల్టీ ఇచ్చిన ఉత్తర్వు ప్రశ్నలను రేకెత్తించింది. దీంతో ఈ ఉత్తర్వుపై ప్రస్తుతం ఐదుగురు సభ్యుల బెంచ్ స్టే విధించింది. అలాగే విచారణ కొనసాగుతున్నందున హామీదారుడు అయిన సుభాష్ చంద్ర.. తన ఆస్తులను ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ బదిలీ చేయడం లేదా విక్రయించడాన్ని కూడా నిషేధించింది.














Click it and Unblock the Notifications