తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ పిటీషన్ పై సుప్రీంకోర్టు నోటీసులు: రెబెల్స్ కు చుక్కలే
తృణమూల్ కాంగ్రెస్ కు తిరుగుబాటు ఎంపీల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న ఆలస్యాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో ప్రతివాదులుగా ఉన్న ఆ చెందిన 20 మంది రెబెల్ ఎంపీలందరికీ కూడా టీసులు జారీ చేసింది. తృణమూల్ ప్రధాన కార్యదర్శి, లోక్సభలో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన ఈ పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది.
అనర్హత పిటిషన్లపై త్వరితగతిన విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకునేలా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు తగిన ఆదేశాలు జారీ చేయాలని అభిషేక్ బెనర్జీ తన పిటిషన్లో సుప్రీంకోర్టును అభ్యర్థించారు. పార్టీ వీడిన ప్రజాప్రతినిధులపై త్వరితగతిన చర్యలు తీసుకోకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ వీ మోహన తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటీషన్ ను విచారించింది.

ఈ విచారణ సందర్భంగా స్పీకర్ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరాలు సమర్పించారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ కింద తృణమూల్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇప్పటికే రెబెల్ ఎంపీలకు అధికారికంగా నోటీసులు జారీ చేశారని ధర్మాసనానికి తెలియజేశారు. స్పీకర్ కార్యాలయం తరఫున తాను హాజరవుతున్నందున విడిగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన కోరారు.
సొలిసిటర్ జనరల్ వాదనలపై జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ స్పందించారు. తుషార్ మెహతా వాదనలతో ఏకీభవించట్లేదని అన్నారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడమే కాకుండా, నిర్దేశిత కాలపరిమితిలోగా అనర్హత విచారణ ప్రక్రియ మొత్తాన్ని ముగించడమే ఇక్కడ ప్రధాన అంశమని స్పష్టం చేశారు. ఈ పిటిషన్లపై స్పీకర్ ఎంత త్వరగా తుది నిర్ణయం ప్రకటిస్తే రాజకీయ వ్యవస్థలో అంత పారదర్శకత ఉంటుందని హితవు పలికారు.
అభిషేక్ బెనర్జీ తన పిటీషన్ లో స్పీకర్తో పాటు లోక్సభ సెక్రటరీ జనరల్ను కూడా ప్రధాన ప్రతివాదులుగా చేర్చారు. అనర్హత వేటును ముప్పు ఎదుర్కొంటున్న తిరుగుబాటు ఎంపీల జాబితాలో సుదీప్ బందోపాధ్యాయ, కాకలి ఘోష్ దస్తీదార్, శతాబ్ది రాయ్, ప్రసూన్ బెనర్జీ, రచన బెనర్జీ, పార్థా భౌమిక్, సయానీ ఘోష్, మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ వంటి పలువురు ఉన్నారు. వీరి భవితవ్యం ఇప్పుడు స్పీకర్ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.













Click it and Unblock the Notifications