సునంద పుష్కర్ మృతి: శశి థరూర్కు నోటీసు
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ మృతి కేసు దర్యాప్తును ముందుకు తీసుకుని వెళ్లే ప్రయత్నంలో భాగంగా ఢిల్లీ పోలీసులు ఆమె భర్త, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు శశి థరూర్కు నోటీసు పంపించారు. సునంద పుష్కర్ మృతి కేసులో ప్రశ్నించేందుకు మాత్రమే పోలీసులు ఆయనకు నోటీసు జారీ చేశారు. నోటీసు జారీ చేసిన విషయాన్ని ఢిల్లీ పోలీసు కమిషనర్ బిఎస్ బస్సీ ధ్రువీకరించారు.
శశిథరూర్కు సిఆర్పిసి సెక్షన్ 160 కింద నోటీసు జారీ చేసినట్లు, కొద్ది రోజుల్లో శశి థరూర్ను ప్రశ్నించినున్నట్లు ఆయన తెలిపారు. కేసు గురించి తెలిసిన వారందరినీ ప్రశ్నిస్తామని మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానంగా బస్సీ సోమవారంనాడు అన్నారు. శశి థరూర్ను తర్వలో ప్రశ్నిస్తామని, అది రేపైనా ఎల్లుండైనా కావచ్చునని ఆయన అన్నరు.
కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వస్తుందని ఆయన చెప్పారు. ఈ కేసులో చాలా మందిని ప్రశ్నించామని, మరింత మందిని వచ్చే రెండు రోజుల్లో ప్రశ్నిస్తామని బస్సీ అంతకు ముందు అన్నారు. తమ సిట్ కేసు దర్యాప్తు చేస్తోందని, త్వరలో ఓ నిర్ణయానికి వస్తుందని అన్నారు. ప్రతి విషయాన్ని సిట్ జాగ్రత్తగా పరిశీలిస్తోందని అన్నారు.
సునంద పుష్కర్ నిరుడు జనవరి 17వ తేదీన ఢిల్లీలోని ఓ హోటల్లో మరణించిన విషయం తెలిసిందే. ఆ మృతిని ఢిల్లీ పోలీసులు ఈ ఏడాది జనవరి 1వ తేదీన హత్య కేసుగా నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే పోలీసులు శశి థరూర్ పని మనిషి నారాయణ్ను పోలీసులు విచారించారు. శశి థరూర్ దంపతుల మిత్రులను, ఇందిరా గాంధీ విమానాశ్రయం సిబ్బందిని పోలీసులు ప్రశ్నించారు.