అద్భుతం: కాల్పుల్లో గాయపడి, ఆడ శిశువుకు జన్మనిచ్చింది
జమ్మూ: జమ్మూ కాశ్మీర్లోని సుంజ్వాన్ ప్రాంతంలోని ఆర్మీ క్యాంప్పై ఉగ్రవాద దాడిలో గాయపడిన గర్భవతి విషయంలో అద్భుతం జరిగింది. సిజేరియన్ శస్త్రచికిత్స ద్వారా ఆడ శిశువుకు జన్మనిచ్చింది.
ఉగ్రవాదులు జరిపిన విచక్షణారహితమైన కాల్పుల్లో 35 వారాల గర్భం ధరించిన మహిళ గాయపడింది. ఆ మహిళను వెంటనే ఆర్మీ చాపర్లో మిలిటరీ ఆస్పత్రికి తరలించి శస్త్రచికిత్స చేశారు.
ఆ తర్వాత మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. శిశువు బరువు 2.5 కిలోలు. ఇది అద్భుతమంటూ ఓ ట్విట్టర్ యూజర్ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లో పెట్టారు. కావేరీ అనే మహిళ సోషల్ మీడియాలో పెట్టారు. తల్లీకూతుళ్లు ఇద్దరు ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నారు.
ఆర్మీ క్యాంప్పై దాడి చేసిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వారు జైషే మొహమ్మద్కు చెందినవారిగా అనుమానిస్తున్నారు. ఆపరేషన్ పలు గంటల పాటు జరిగింది.
ఉగ్రవాదులకు చెందిన ఎకె - 47 ఆసాల్ట్ రైఫిల్స్, ఇతర ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కాగా, ఆదివారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పరిస్థితిని సమీక్షించారు.