రాజకీయ పార్టీలకు ఝలక్! విరాళాల వివరాలు చెప్పాల్సిందేనన్న సుప్రీంకోర్ట్!
ఢిల్లీ : ఎలక్టోరల్ బాండ్స్కు సంబంధించి సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎలక్టోరల్ బాండ్స్ను రుద్దు చేయమని స్పష్టం చేసింది. అయితే రాజకీయ పార్టీలు విరాళాల వివరాలను బహిర్గతం చేయాల్సిందేనని స్పష్టంచేసింది. దీనిపై సమగ్ర విచారణ అవసరమని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోత్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది.

మే 30లోగా విరాళాల వివరాలు
ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేయమని ప్రకటించిన సుప్రీంకోర్టు రాజకీయ పార్టీలకు మాత్రం షాక్ ఇచ్చింది. వివిధ పార్టీలకు విరాళాల రూపంలో వచ్చే డబ్బు లెక్కలు ప్రజలకు చెప్పాల్సిందేనని స్పష్టం చేసింది. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చిన విరాళాల వివరాలను దేశంలోని అన్ని రాజకీయపార్టీలు మే 30లోగా ఎలక్షన్ కమిషన్కు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పొలిటికల్ పార్టీలు సీల్డ్ కవర్లలో అందించే ఈ వివరాలను తదుపరి ఆదేశాల వరకు ఈసీ భద్రపరచాలని స్పష్టం చేసింది.

బాండ్ల అమ్మకాలపై పరిమితి
ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఆర్థిక శాఖకు సైతం కీలక ఆదేశాలు జారీ చేసింది. బాండ్ల అమ్మకాల కాల వ్యవధిని కుదించాలని ఆదేశించింది. ఏప్రిల్, మే నెలల్లో బాండ్ల అమ్మకాలను 10 నుంచి 5 రోజులకు పరిమితం చేయాలని స్పష్టం చేసింది.

బాండ్లు రద్దు చేయాలని ఏడీఆర్ పిటీషన్
రాజకీయపార్టీలకు విరాళాల విషయంలో పారదర్శకత లోపించిందని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఎలక్టోరల్ బాండ్లు రద్దు చేయాలంటూ అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ అనే ఎన్జీఓతో పాటు మరికొందరు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల్లో పారదర్శకత అవసరమని అభిప్రాయపడింది. ఏయే రాజకీయపార్టీకి ఎవరు ఎంత మొత్తం విరాళం ఇస్తున్నారో ప్రజలకు తెలియాల్సిన అవసరముందని చెప్పింది.

సమగ్ర విచారణ జరుపుతామన్న ధర్మాసనం
ఎలక్టోరల్ బాండ్లు రద్దు చేయమని ప్రకటించిన సుప్రీంకోర్టు ఈ అంశంపై సమగ్ర విచారణ అవసరమని అభిప్రాయపడింది. ఒకట్రెండు వాయిదాల్లో ఈ అంశం తేలదని.. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఈ నేపథ్యంలో ఎవరికీ నష్టం జరగకూడదన్న ఉద్దేశంతో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications