టాటా మోటార్స్ కు సుప్రీం షాక్ : సింగూరు భూకేటాయింపులు రద్దు
కోల్ కతా : సుప్రసిద్ద మోటార్స్ కంపెనీ టాటా మోటార్స్ కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. కంపెనీ ప్లాంట్ కోసం పశ్చిమ బెంగాల్ లోని సింగూరు ప్రజల వద్ద నుంచి సేకరించిన భూములను తిరిగి వెనక్కి ఇచ్చేయాలని తీర్పునిచ్చింది సుప్రీం. ఇప్పటిదాకా చెల్లించిన నష్ట పరిహారాలను కూడా కంపెనీ తిరిగి వసూలు చేయొద్దని ఆదేశించింది.
కేసు విషయానికొస్తే.. 2006లో అప్పటి వామపక్ష ప్రభుత్వం సింగూర్ లో టాటా మోటార్స్ కంపెనీకి 997 ఎకరాల భూమిని కేటాయించింది. దీనిని వ్యతిరేకిస్తూ.. అప్పటి ప్రతిపక్ష నేత, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ ఆధ్వర్యంలో ప్రజలంతా పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. ప్రజా ఆందోళనతో సింగూరులో ఏర్పాటు చేయాల్సిన ప్లాంట్ ను 2008లో గుజరాత్ కు మార్చకుంది టాటా మోటార్స్.

అనంతరం మమతాబెనర్జీ అధికారంలోకి వచ్చాక.. టాటా మోటార్స్ కు కట్టబెట్టిన సింగూరు భూములను స్వాధీనం చేసుకునేందుకు ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ.. టాటా మోటార్స్ కోల్ కతా హైకోర్టును ఆశ్రయించింది. అక్కడి నుంచి విషయం సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. తాజాగా దీనిపై తీర్పు వెలువరించిన కోర్టు.. అప్పటి వామపక్ష ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులను తప్పుబట్టింది.
గత మే నెలలో.. టాటా యాజమాన్యం వాదనలతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ మరియు సింగూరు భూనిర్వాసితుల వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు, తీర్పును రిజర్వ్ చేసి పెట్టింది. బుధవారం నాడు తుది తీర్పు వెల్లడించింది. తాజా తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేస్తోన్న సింగూరు బాధితులు సీఎం మమతా బెనర్జీకి జేజేలు కొడుతున్నారు.
అప్పటి వామపక్ష ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని చెబుతూ.. టాటా మోటార్స్ కు ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది కోర్టు. అసలైన భూ నిర్వాసితులను గుర్తించి 10 వారాల్లోగా ఆ భూములను తిరిగి నిర్వాసితులకు ఇచ్చేయాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications