7గురు కుటుంబసభ్యుల హత్య: ప్రేమికుల ఉరిశిక్షను సమర్థించిన సుప్రీం
ఢిల్లీ: తల్లిదండ్రులతో సహా ఏడుగురు కుటుంబసభ్యులను దారుణంగా హత్య చేసిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువతి, ఆమె ప్రియుడికి విధించిన ఉరిశిక్షను సుప్రీం కోర్టు సమర్థించింది. 2013లో అలహాబాద్ హైకోర్టు విధించిన ఉరిశిక్షను సవాల్ చేస్తూ సలీమ్, శబ్నం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని జస్టిస్ బాబ్డే, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది.
‘నీవు కూడా ఓ తల్లివే అయినప్పటికీ సొంత కుటుంబసభ్యుల పట్ల ఎలాంటి కనికరం చూపలేదు. 10నెలల పసికందును కూడా చంపేశావు. నీకు ఎలాంటి ఉపశమనాన్ని ఇవ్వలేం' అని పేర్కొన్న ధర్మాసనం వారి వ్యాజ్యాన్ని తిరస్కరించింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోహా జిల్లాకు చెందిన సలీమ్, శబ్నం ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్న వారి కోరికను యువతి కుటుంబం వ్యతిరేకించింది. దీంతో 2008 ఏప్రిల్ 15న శబ్నం పాలలో మత్తుమందు ఇచ్చి తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు, వారి భార్యల గొంతుకోసి హత్య చేయడంతోపాటు 10 నెలల మేనల్లుడిని కూడా గొంతునులిమి చంపేసింది.
సలీం ప్రేరేపించడం వల్లే ఆమె ఈ హత్యలు చేసిందని దర్యాప్తులో చేరింది. దారుణ హత్యలకు పాల్పడిన సలీం, శబ్నంలకు 2013లో అలహాబాద్ హైకోర్టు విధించిన ఉరిశిక్షను సుప్రీం కోర్టు సమర్థిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది.