జల్లికట్టుపై సుప్రీం తాజా నిర్ణయం: విచారణకు వ్యతిరేక పిటిషన్లు..
జనవరి 30న ఏడబ్ల్యూబీఐ సహా ఇతర జంతు సంరక్షణ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లన్నింటిని ఒకేసారి విచారిస్తామని బుధవారం నాడు సుప్రీం వెల్లడించింది.
న్యూఢిల్లీ: తమిళనాట జల్లికట్టుపై జరుగుతోన్న భారీ ఆందోళనల నడుమ సుప్రీం కోర్టు తీసుకున్న తాజా నిర్ణయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. జల్లికట్టును వ్యతిరేకిస్తూ జంతు సంక్షేమ బోర్డు (ఆనిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా-ఏడబ్ల్యూబీఐ) సహా ఇతర జంతు సంరక్షణ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం విచారణకు స్వీకరించింది.
ఈ మేరకు పిటిషన్లపై విచారణ జరిపేందుకు అంగీకారం తెలుపుతూ బుధవారం నాడు సుప్రీం నిర్ణయం తీసుకుంది. జల్లికట్టును పునరుద్దరిస్తూ తమిళనాడు ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్ ను, ఆ వెను వెంటనే దాన్ని అసెంబ్లీ తీర్మానం ద్వారా చట్టంగా ఆమోదించడాన్ని జంతు సంక్షేమ బోర్డు సవాల్ పిటిషన్ ద్వారా చేసింది.
జనవరి 30న ఏడబ్ల్యూబీఐ సహా ఇతర జంతు సంరక్షణ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లన్నింటిని ఒకేసారి విచారిస్తామని బుధవారం నాడు సుప్రీం వెల్లడించింది. జల్లికట్టుపై పెటా వాదనను సమర్థిస్తూ గతేడాది జల్లికట్టుపై సుప్రీం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
ఆర్డినెన్స్ కు దెబ్బేనా?
జల్లికట్టుపై రాష్ట్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను సుప్రీం కొట్టివేస్తుందా? అన్న అనుమానాలు ఓవైపు ఉండగానే.. జస్టిస్ మార్కేండయ కట్జూ చేసిన వ్యాఖ్యలు అలాంటిదేమి ఉండబోదని స్పష్టం చేస్తున్నాయి.
సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జల్లికట్టుపై తమిళ సర్కార్ జారీ చేసిన ఆర్డినెన్స్ తాత్కాళికమైనదే అయినా.. శాసనసభ ఆమోదంతో అది చట్టంగా మారిందని కట్జూ గుర్తుచేశారు.
అసెంబ్లీ ఆమెదం పొందిన బిల్లును సుప్రీంలో సవాల్ చేసుకునే వీలున్నప్పటికీ.. రాజ్యాంగంలోని అధికరణ254(2) ప్రకారం జల్లికట్టు బిల్లుకు రక్షణ లభిస్తుందని తెలిపారు. కాబట్టి జల్లికట్టు అభిమానులు భయపడాల్సిన అవసరం లేదనేది కట్జూ అభిప్రాయం.