వీవీప్యాట్ లెక్కింపు పిటీషన్: నాన్సెన్స్! : సుప్రీంకోర్టు అసహనం
న్యూఢిల్లీ: ఓట్ల లెక్కింపు సందర్భంగా వందశాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశించాలని కోరుతూ కొంతమంది ఐటీ నిపుణులు దాఖలు చేసిన పిటీషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం కొట్టి పడేసింది. ఏ ఉద్దేశంతో ఈ పిటీషన్ను దాఖలు చేశారని ఐటీ నిపుణుల తరఫు న్యాయవాదిని సూటిగా ప్రశ్నించింది. వందశాతం వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు కుదరదని అంటూ ఇదివరకే ప్రధాన న్యాయమూర్తి తీర్పు ఇచ్చారని, దీన్ని పునః సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటీషన్ను కూడా తోసి పుచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ పిటీషన్ను నాన్సెన్స్గా అభివర్ణించింది.
చెన్నైకి చెందిన టెక్ ఫర్ ఆల్ అనే సంస్థ ఈ పిటీషన్ను దాఖలు చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో లోపాలు ఉన్నాయని, వాటిని సులువుగా ట్యాంపర్ చేయొచ్చని, ఈ ఉద్దేశంతో- వందశాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ టెక్ ఫర్ ఆల్ సంస్థ ప్రతినిధులు ఈ పిటీషన్ను దాఖలు చేశారు.
దీన్ని సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారణకు స్వీకరించింది. వాదోపవాదాలను ఆలకించింది. పిటీషన్ను పరిశీలించిన అనంతరం న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై ఇదివరకే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చిందని, తాము దీన్ని మార్చలేమని, మార్చడానికి గల సహేతుక కారణాలు కూడా లేవని పేర్కొన్నారు. ఈ పిటీషన్ను కొట్టేస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలను తాము ధిక్కరించలేమని స్పష్టం చేశారు.
50 శాతం మేర వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని కోరుతూ ఇదివరకు 21 ప్రతిపక్ష పార్టీల నాయకులు దాఖలు చేసిన పిటీషన్పై సుప్రీంకోర్టు విచారించిన విషయం తెలిసిందే. అప్పటి వరకూ ఒక్కో నియోజకవర్గంలో ఒక్క ఈవీఎం, అందులో నుంచి వెలువడిన వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించే విధానం అమలులో ఉండగా.. ఈ సంఖ్యను అయిదుకు పెంచుతూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అది కుదరదని, 50 శాతం మేర స్లిప్పులను లెక్కించాల్సిందేనని అంటూ 21 ప్రతిపక్ష పార్టీలు రివ్యూ పిటీషన్ను దాఖలు చేయగా.. దాన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు.