NEET UG 2024 Results: నీట్ ఫలితాల విడుదలకు లైన్ క్లియర్-సుప్రీం డెడ్ లైన్ ఇదే..!
దేశవ్యాప్తంగా ఈ ఏడాది వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ స్థాయి పరీక్ష నీట్ ఫలితాల విడుదలపై సస్పెన్స్ తొలగిపోయింది. పలు చోట్ల పేపర్ లీక్ ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో రీటెస్ట్, ఫలితాల విడుదల డైలమాలో పడింది. ఈ నేపథ్యంలో దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. రీటెస్ట్ డిమాండ్లను తోసిపుచ్చుతూ ఫలితాల విడుదలపై జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కు కీలక ఆదేశాలు జారీ చేసింది.

నీట్ పరీక్షపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు సీజే డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య బెంచ్ ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. ఈ ఏడాది నీట్ పరీక్ష ఫలితాలను ఈ నెల 20న శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోగా వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీకి ఆదేశాలు ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటికే నీట్ ఫలితాల ప్రకటన కాగా.. అందులో అభ్యంతరాలతో తిరిగి వీటిని విడుదల చేస్తున్నారు.
ఇవాళ సుప్రీంకోర్టులో నీట్ పిటిషన్ల విచారణ సందర్భంగా, పిటిషనర్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది నరేంద్ర హుడా పారదర్శకతను తీసుకురావడానికి నీట్ పరీక్ష రాసిన విద్యార్థులందరి ఫలితాలను ప్రకటించాలని కోరారు. గతంలో మొత్తం విద్యార్ధుల ఫలితాలను వెల్లడించలేదని, అది విద్యార్ధుల ఆస్తిని సొలిసిటర్ జనరల్ వాదించారు. దీనిపై స్పందించిన సీజేఐ చంద్రచూడ్.. కేంద్రాల వారీగా సీక్వెన్స్లో డమ్మీ రోల్ నంబర్లు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నీట్-యూజీ 2024 పరీక్షలో విద్యార్థులు సాధించిన మార్కులను ప్రచురించాలని ఎన్టిఎకు ఆదేశాలు ఇచ్చింది. అదే సమయంలో విద్యార్థుల గుర్తింపును బహిర్గతం చేయకూడదని షరతు పెట్టింది.












Click it and Unblock the Notifications