మానవాళి పెను సంక్షోభంలో ఉంది - టీకా జాతీయకరణ ఎందుకు చేయరు: కేంద్రంపై సుప్రీం ఫైర్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, కరోనాతో సంభవిస్తున్న మరణాల సంఖ్య పెరిగిపోతుండటంతో సుప్రీంకోర్టు సీరియస్గా రియాక్ట్ అయ్యింది. ఈ క్రమంలోనే పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో పౌరులు తమ కోవిడ్ కష్టాలు లేదా ఇబ్బందులు లేదా ఏమైనా సమాచారం అడిగినప్పుడు వెంటనే ఆయా ప్రభుత్వాలు స్పందించాలని ఆదేశాలు జారీ చేసింది. పౌరులను వేధిస్తే కోర్టు ధిక్కారణ కింద పరిగణిస్తామని పేర్కొంది.
"ఒక పౌరుడిగానే కాకుండా ఒక జడ్జిగా కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాను. ఒక పౌరుడు సోషల్ మీడియా ద్వారా తన బాధన వ్యక్తం చేస్తే ప్రభుత్వాలు సరిగ్గా స్పందించి సమాచారం ఇవ్వాలి. వారి బాధలను వినేందుకు మొగ్గు చూపండి. బెడ్ కోసం లేదా ఆక్సిజన్ కోసం ఎవరైనా అడిగినప్పుడు వారి పట్ల దాడి చేయడం కాని దురుసుగా వ్యవహరించడం గానీ చేసినట్లు కోర్టు దృష్టికి వస్తే ధిక్కారణ కింద పరిగణిస్తాము. మానవాళి తీవ్ర సంక్షోభంలో ఉంది" అని కేసును విచారణ చేపట్టిన జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ వచ్చిన డాక్టర్లకు, హెల్త్ కేర్ వర్కర్లకు కూడా పడకలు దొరకడం లేదంటూ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం అవుతోందని జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు.
ఇక కేసును విచారణ చేస్తున్న సమయంలో పలు ప్రశ్నలు కేంద్ర ప్రభుత్వానికి సంధించింది న్యాయస్థానం. టీకాలు మొత్తం కేంద్రమే ఎందుకు కొనడం లేదని, కేంద్రం రాష్ట్రాలకు టీకా ధరల్లో తేడా ఎందుకుందని ప్రశ్నించింది. జాతీయ టీకా విధానాన్ని పాటిస్తూ టీకాలను కేంద్రమే సేకరించి ఎందుకు పంపిణీ చేయట్లేదని ప్రశ్నించిన అత్యున్నత న్యాయస్థానం... శ్మశానవాటిక సిబ్బందికి వ్యాక్సినేషన్ పై ఏం చేస్తున్నారని అడిగింది. ఇక ఈ సమయంలో సోషల్ మీడియాలో పౌరులు వ్యక్తం చేస్తున్న తమ బాధను మరోకోణంలో చూడరాదని కోర్టు చెప్పింది.
మే 1వ తేదీ నుంచి 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల వయసున్న వారికి టీకా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఢిల్లీ, పంజాబ్, మధ్యప్రదేశ్, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత ఉంది. ఇదిలా ఉంటే... టీకా ధరలపై కూడా ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై కూడా కోర్టు స్పందించింది. 18-45 ఏళ్ల లోపు ఉన్న వారు దేశంలో 59 కోట్ల మంది ఉన్నారని... ఇలా అయితే పేద ప్రజలకు వ్యాక్సిన్ వేయించుకునేందుకు డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయని ప్రశ్నించింది. టీకాలు ఇచ్చే క్రమంలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం లేకుండా చూడాలని కోర్టు సూచించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పలు వ్యాధులకు టీకాలు ప్రభుత్వం ఎలాగైతే ఇచ్చిందో ఇప్పుడు కూడా అలానే వ్యవహరించాలని కోర్టు సూచించింది.