యాసిడ్: ఐదు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: యాసిడ్ దాడులు అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, యాసిడ్ దాడుల బాధితులకు ఎలాంటి సహాయం అందించారనే వివరాలు సమర్పించని ఐదు రాష్ట్రాలకు సుప్రీం కోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది.
యాసిడ్ దాడులపై సమర్పించిన అర్జీని బుధవారం సుప్రీం కోర్టు విచారణ చేసింది. ఈ సందర్బంలో కోర్టు ఆదేశాలను ధిక్కరించారని కేరళ, కర్ణాటక, జమ్మూ అండ్ కాశ్మీర్, మిజోరం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను నోటీసులు జారీ చేశారు.
గతంలో యాసిడ్ దాడులపై సుప్రీం కోర్టులో అర్జీ విచారణ జరిగింది. ఆ సందర్బంలో యాసిడ్ దాడుల వివరాలు, బాధితులను ఏ విధంగా ఆదుకుంటున్నారు అని పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ విషయంపై ఈ ఐదు రాష్ట్రాలు సుప్రీం కోర్టుకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం 2014లో దేశంలో 309 యాసిడ్ దాడులు జరిగాయని, అందులో ఉత్తరప్రదేశ్ లో 185 కేసులు, మధ్యప్రదేశ్ లో 57 కేసులు నమోదు అయ్యాయని కోర్టుకు సమాచారం ఇచ్చింది.
అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులతో సమావేశం ఎర్పాటు చేసి యాసిడ్ దాడులకు గురైన వారికి అవసరమైన చికిత్స అందివ్వాలని సూచించామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్జీ విచారణ సమయంలో యాసిడ్ ను సంతలో అమ్ముతున్న వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.