సుప్రీం కోర్టు జడ్జ్ ల వ్యవహారం: ప్రజల దృష్టి మళ్లించడానికి చిదంబరం ఇంటిలో ఈడీ !
న్యూఢిల్లీ: భారత న్యాయవ్యవస్థలో అనూహ్య కుదుపుతో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టులో పాలనపరమైన లోపాలను ఎండగడుతూ నలుగురు సీనియర్ న్యాయమూర్తులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.
పరిస్థితులను చక్కదిద్దాలని ఎంత చెప్పినా భారత ప్రధాన న్యాయమూర్తి పెడచెవినపెట్టారంటూ ధ్వజమెత్తారు. దేశహితం కోసమే ఈ అంశాన్ని ప్రజల ముందు పెడుతున్నామని, తాము రాజకీయం చెయ్యడానికి రాలేదని సుప్రీం కోర్టుకు చెందిన నలుగురు న్యాయమూర్తులు చెప్పారు.
దేశ చరిత్రలో తొలిసారిగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యానికి మూలమైన లేఖను న్యాయమూర్తులు బహిర్గతం చేశారు. దేశం మొత్తం సుప్రీం కోర్టు న్యాయమూర్తలు వ్యవహారం మీద దృష్టి పెట్టంది. సుప్రీం కోర్టు వ్యవహారంలో తాము జోక్యం చేసుకోమని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
కేంద్ర మాజీ మంత్రి చిదంబరంకు చెందిన చెన్నై, న్యూఢిల్లీలోని ఇళ్లలో శనివారం ఈడీ అధికారులు సోదాలు చేశారు. అయితే ఈడీ అధికారులు తమకు వ్యతిరేకంగా ఒక్క సాక్షం కూడా సేకరించలేదని స్వయంగా చిదంబరం మీడియాకు చెప్పారు.
సుప్రీం కోర్టు న్యాయమూర్తుల వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి చిదంబరం ఇంటిలో ఈడీ అధికారులు సోదాలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో వైపు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను పిలిపించుకుని సుప్రీం కోర్టు న్యాయమూర్తుల వ్యవహారం గురించి చర్చించారు.