లాస్ట్ చాన్స్, తమిళనాడుకు నీళ్లు వదలండి: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: కావేరీ జలాల పంపణి విషయంలో కర్ణాటక ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 6వ తేది వరకు ప్రతి రోజు 6,000 క్యూసెక్కుల నీరు తమిళనాడుకు విడుదల చెయ్యాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
శుక్రవారం సుప్రీం కోర్టులో కావేరీ జలాల వివాదంపై విచారణ జరిగింది. ఈ సందర్బంగా సుప్రీం కోర్టు దేశాలను జారీ చెయ్యకుండా కర్ణాటక మొండిగా వ్యవహరిస్తుందని తమిళనాడు ఆరోపించింది. కావేరీ జలాల తాగు నీటి కోసం ఉపయోగించుకుంటామని కర్ణాటక చెప్పింది.
తాగు నీటి సమస్య వస్తుందనే తాము తమిళనాడుకు నీరు విడుదల చెయ్యడంలేదని కర్ణాటక స్పష్టం చేసింది. అంతే కాని న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించలేదని సుప్రీం కోర్టుకు చెప్పింది. కావేరీ నీరు ఉన్న నాలుగు జలాశయాలు అడుగంటిపోయాయని కర్ణాటక చెప్పింది.

కర్ణాటకలోని అన్నీ పార్టీల శాసన సభ్యులు తమిళనాడుకు నీరు వదిలిపెట్టరాదని శాసన సభలో తీర్మాణం తీసుకున్నారని కర్ణాటక న్యాయవాది ఎస్. నారీమన్ సుప్రీం కోర్టులో చెప్పారు. కావేరీ నీరు వదిలిపెడితో బెంగళూరు నగరంతో సహ కొన్ని జిల్లాల ప్రజలు అల్లాడిపోతారని కోర్టులో చెప్పారు.
ఇదే సందర్బంలో సుప్రీం కోర్టు మండిపడింది. మీరు భారతదేశంలో ఉన్నారని గుర్తు పెట్టుకోండి అని కర్ణాటకకు చెప్పింది. దేశంలో ఎవరైనా సరే సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించాలని చెప్పింది. నాలుగు వారాల్లో కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
మూడు రోజుల్లోనే తాము కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో చెప్పింది. అక్టోబర్ 4,5 తేదీల్లో కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు కర్ణాటక వెళ్లి కావేరీ జలాలపై అధ్యయనం చెయ్యాలని, అక్టోబర్ 6వ తేది కోర్టులో నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు సూచించింది.
ఇదే మీకు చివరి అవకాశం, మా ఆదేశాలను ధిక్కరించవద్దు అంటూ సుప్రీం కోర్టు కర్ణాటకకు చెప్పింది. ఈ కేసు విచారణ అక్టోబర్ 6వ తేదికి వాయిదా వేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో కర్ణాటకకు పుండు మీద కారం చల్లినట్లు అయ్యింది. సుప్రీం కోర్టు తీర్పును తమిళనాడు స్వాగతించింది.












Click it and Unblock the Notifications