సుప్రీం కోర్టులో సంచల పిటిషన్! చిన్నారుల కిడ్నాప్లపై ఇక దేశమంతా ఒకేలా..
దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న చిన్నారుల అపహరణలు, కిడ్నాపింగ్ ఘటనలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ఒక అత్యంత కీలకమైన ప్రజాప్రయోజన పిటిషన్ దాఖలైంది. పిల్లలు అదృశ్యమైనప్పుడు విచారణ ప్రక్రియలో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని నివారించేందుకు, దేశమంతటా ఒకే రకమైన ప్రత్యేక విచారణ వ్యవస్థను రూపొందించాలని ప్రముఖ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. చిన్నారుల కిడ్నాప్ కేసుల్లో నిర్ణీత కాలపరిమితితో కూడిన విచారణ, వేగవంతమైన విచారణ ప్రక్రియలు అత్యంత అవసరమని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
చిన్నారులు కనిపించకుండా పోయినప్పుడు పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా.. కేవలం "అదృశ్యం" లేదా "గుమ్షుదా" నివేదికలకే పరిమితం చేస్తున్నారని పిటిషన్లో ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల పూర్తిస్థాయి క్రిమినల్ విచారణ ప్రారంభం కావడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ అలసత్వం వల్ల కిడ్నాప్నకు గురైన చిన్నారులు హ్యూమన్ ట్రాఫికింగ్ , లైంగిక వేధింపులు, వెట్టిచాకిరీ , అక్రమ దత్తతల ముఠాల చేతుల్లోకి చిక్కుకుని నరకం అనుభవిస్తున్నారని పిటిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్యేక కోర్టులు.. ఏడాదిలోనే శిక్ష పడేలా చర్యలు!
ఈ తరహా కేసుల విచారణను ఏసీపీ లేదా ఎస్హెచ్ఓ స్థాయి సీనియర్ పోలీస్ అధికారులకు మాత్రమే అప్పగించేలా కేంద్రం, రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేల కోసం ఏర్పాటైన ప్రత్యేక కోర్టుల తరహాలోనే.. చిన్నారుల కిడ్నాప్ కేసుల విచారణకు కూడా ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి, గరిష్టంగా ఏడాది వ్యవధిలోనే విచారణ పూర్తిచేసి తీర్పు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరారు. కేసుల నమోదులో దేశవ్యాప్తంగా ఒకే రకమైన 'ప్రశ్నావళి', ప్రామాణిక పద్ధతులను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
నేరస్థుల ఆస్తుల జప్తు.. కఠినమైన శిక్షలు!
కిడ్నాప్లకు పాల్పడే ముఠాలు, నేరస్థుల మూలాలను దెబ్బతీసేందుకు కఠిన ప్రతిపాదనలను పిటిషన్లో చేర్చారు. నేరస్థులతో పాటు వారి కుటుంబ సభ్యుల చర, స్థిరాస్తులను వెంటనే జప్తు చేయాలని.. వీరిపై మనీ లాండరింగ్, బెనామీ ఆస్తుల నిరోధక చట్టాల కింద కూడా కేసులు నమోదు చేయాలని కోరారు. అంతేకాకుండా, వేర్వేరు నేరాలకు పడే శిక్షలను ఒకదానితో ఒకటి కాకుండా , వరుసగా అనుభవించేలా చట్టాల్లో మార్పులు తెస్తేనే నేరస్థుల్లో భయం పుడుతుందని పేర్కొన్నారు.
అంతర్రాష్ట్ర ముఠాల ఆటకట్టించేలా కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు!
చిన్నారుల అక్రమ రవాణా, విక్రయాల వెనుక విభాగాలు మార్చుకుంటూ పనిచేసే పెద్ద అంతర్రాష్ట్ర ముఠాలు ఉన్నాయని, వీటిని అణచివేసేందుకు అన్ని రాష్ట్రాల పోలీసుల మధ్య బలమైన సమన్వయం అవసరమని పిటిషనర్ తెలిపారు. ఈ కేసులో కేంద్ర హోం శాఖ, విద్యా శాఖ, న్యాయ శాఖలతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు , లా కమిషన్లను ప్రతివాదులుగా చేర్చారు. సుప్రీం కోర్టు ఈ పిటిషన్పై సానుకూలంగా స్పందిస్తే.. దేశంలో చిన్నారుల భద్రతకు ఒక కొత్త చట్టపరమైన రక్షణ కవచం ఏర్పడే అవకాశముంది.














Click it and Unblock the Notifications