కుమారస్వామికి ఊరట: హిందూ మహసభ పిటిషన్పై సుప్రీం ఇలా
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రిగా జెడి(ఎస్) నేత కుమారస్వామి ప్రమాణస్వీకారం చేయడాన్ని సవాల్ చేస్తూ హిందూ మహాసభ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం ముందుగా విచారించాలని కోరడాన్తిని రస్కరించింది. సోమవారం నాడు ఉదయం సుప్రీంకోర్టులో హిందూ మహాసభ కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేయడాన్ని నిరసిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
అయితే ఈ పిటిషన్ను మంగళవారం నాడు ఉదయమే విచారణ చేపట్టాలని హిందూ మహసభ సుప్రీంకోర్టును కోరింది. అయితే దీన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. రాజ్యాంగానికి విరుద్దంగా కుమారస్వామి కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తూ సుప్రీం కోర్టులో హిందూమహాసభ పిటిషన్ దాఖలు చేసింది.
యడ్యూరప్ప విశ్వాస పరీక్షకు ముందే సీఎం పదవికి రాజీనామా చేయడంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతూ ఆ రాష్ట్ర గవర్నర్ జెడి(ఎస్), కాంగ్రెస్ పార్టీ సంకీర్ణాన్ని ఆహ్వానించారు. ఈ నిర్ణయాన్ని హిందూ మహాసభ తప్పుబట్టింది.
నియమాలకు విరుద్దంగా కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారని దీన్ని నిలిపివేయాలని కోరుతూ హిందూ మహాసభ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జెడి(ఎస్), కాంగ్రెస్ పొత్తు అంశంతో పాటు ఇతర ఉల్లంఘనలు కూడ చోటు చేసుకొన్నాయని హిందూ మహాసభ అభిప్రాయపడింది.
హిందూ మహాసభ తరుపున అడ్వకేట్ బరున్ కుమార్ సిన్హా ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.దీంతో మే 23 వ తేదిన కుమారస్వామి ప్రమాణస్వీకారం చేసేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయాయి.
అఖిల భారత మహాసభ 1907లో ఏర్పాటైంది. కానీ, ఈ సంస్థను 1915 లో భారతదేశ వ్యాప్తంగా విస్తరించారు. ఈ సంస్థ హిందూ సంఘటన ఉద్యమంతో పాటు హిందూవుల రక్షణ కోసం ఏర్పాటు చేయబడినట్టుగా చెబుతారు.
దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులు ఈ సంస్థతో సంబంధాలు కలవారు. పండిత్ మదన్ మోహన్ మాలవ్యా, ఎన్ సి కేల్కకర్, లాలాలజపతిరాయ్, దామోదర్ సావర్కర్ తదితరులు కూడ ఈ సంస్థలో పనిచేశారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసిన డాక్టర్ రాజేంద్రప్రసాద్, బాబుజగ్జీవన్ రామ్ తదితరులు కూడ ఈ సంస్థతో ఆనాడు కలిసి పనిచేశారని చెబుతారు. 1935 లో హిందూ మహసభ మద్దతుతో కాంగ్రెస్ నేషనలిస్టు పార్టీ యూపీ అసెంబ్లీలో 33 సీట్లకు గాను 13 సీట్లను కైవసం చేసుకొంది.