ఎన్నిక జరపాల్సిందే: పోలీసులు మరింత కట్టుదిట్టంగా ప్రొటెక్షన్ ఇవ్వాలి.. త్రిపుర ఎన్నికలపై సుప్రీంకోర్టు
త్రిపుర మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఎన్నికల సమయంలో హింస చెలరేగే అవకాశం ఉందని టీఎంసీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్ నాథ్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ క్రమంలో సరైన భద్రత కల్పించాలని పోలీసులకు స్పష్టంచేసింది. హింస పేరుతో ఎన్నికలను నిర్వహించకుండా ఆపలేమని స్పష్టంచేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న తరుణంలో త్రిపురలో రోజురోజుకూ శాంతిభద్రతల పరిస్థితులు క్షీణిస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. టీఎంసీ దాఖలు చేసిన కంటెప్ట్ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.
త్రిపురలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ బాధ్యత పోలీసులదని.. శాంతి భద్రతలు క్షీణించకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉందని వివరించింది. ఎన్నికల నిర్వహణ బాధ్యతను పోలీసు ఉన్నతాధికారులు చూడాలని కోరింది. హోం శాఖ సెక్రటరీ, డీజీపీ, ఐజీపీ ఎన్నికల సరళిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించింది.
ఎన్నికలు సజావుగా జరిగేందుకు తీసుకుంటున్న చర్యలపై సమగ్ర ప్రకటన చేయాలని ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ను ఆదేశించింది. ''మీరు మీ ఇంటికే పరిమితమయ్యారని తెలుసుకున్నాం. మేము చేయగలిగేది ఏముందంటే మీకు ఒక గంటన్నర సమయం ఇవ్వడం. ఇవాళ, రేపు పోలింగ్ బూత్ల వద్ద భద్రత కోసం తీసుకుంటున్న చర్యలు, పోలింగ్ రోజు నుంచి ఫలితాలు వెల్లడించేంత వరకూ సజావుగా సాగేందుకు తీసుకుంటున్న చర్యలపై పోలీసులు, హోం సెక్రటరీ నుంచి స్పష్టత తీసుకోండి. స్పష్టమైన సమాచారం తీసుకుని ఇవాళ మధ్యాహ్నం 12.45 గంటలకు తిరిగి మాకు తెలియజేయండి''అని కోర్టు ఆదేశించింది.
టీఎంసీ తరఫు న్యాయవాది తన వాదన వినిపిస్తూ, త్రిపురలో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసున్నాయని అన్నారు. ''మేము సమర్పించిన స్క్రీన్షాట్లలో హింస జరిగినప్పుడు పోలీసులు అచేతనంగా నిలబడి ఉండటం చాలా స్పష్టంగా మీరు చూడవచ్చు'' అని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై త్రిపుర ప్రభుత్వ న్యాయవాది మహేష్ జెఠ్మలానీని జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం ప్రశ్నిస్తూ, ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరిగేందుకు మీరు తీసుకుంటున్న చర్యలేమిటో తెలుసుకోవాలనుకుంటున్నాం. కౌంటింగ్ ఎప్పడు? ఇవాళ, కౌంటింగ్ రోజు ఎలాంటి అనుచిత ఘటనలు చోటుచేసుకోకుండా మీరు తీసుకుంటున్న చర్యలు ఏమిటి? అని అడిగింది.
అగర్తలా మున్సిపల్ సంస్థలకు ఈనెల 25న ఎన్నికల జరుగనున్న తరుణంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో త్రిపురలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆదివారం టీఎంసీ త్రిపుర విభాగం స్టీరింగ్ కమిటీ చీఫ్ సుబల్ భౌమిక్ నివాసంపై జరిగిన దాడిలో పలువురికి గాయాలైనట్టు ఆ పార్టీ ఇంతకుముందు ఆరోపించింది.