నిందితులకు ముందస్తు బెయిల్ ఛాన్స్: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ చట్టం యధాతథం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సవరణం-2018ను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లను కొట్టేసింది. ఈ చట్టం యధాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ సవరణల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద అరెస్టయిన నిందితులకు ముందస్తు బెయిల్ లభిస్తుంది. విచారణ తరువాతే ముందస్తు బెయిల్ మంజూరవుతుంది.
సవరణ చట్టం యధాతథం..
ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో చేసిన సవరణలను సవాల్ చేస్తూ ఇదివరకు దాఖలైన పిటీషన్లను ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. సవరణలు చేస్తూ పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ వినీత్ జైన్, జస్టిస్ రవీంద్ర భట్ తమ తుది తీర్పును వెల్లడించారు.
సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ల కొట్టివేత..
ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో 2018లో కేంద్రప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. దీన్ని విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. గత ఏడాది అక్టోబర్ 3వ తేదీన విచారణలను పూర్తి చేసింది. తీర్పును రిజర్వ్లో ఉంచింది. తాజాగా- ఆ తీర్పును వెల్లడించింది. సవరణలతో రూపొందించిన చట్టం యధాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది.
చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే కారణంతో..
ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద ఆరోపణలను ఎదుర్కొంటున్న వారికి ముందస్తు బెయిల్ లభించే అవకాశాన్ని కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు 2018లో పాత చట్టాన్ని సవరించింది. ఆరోపణలను ఎదుర్కొంటున్న ముందస్తు బెయిల్ మంజూరు చేయడం సరికాదంటూ సుప్రీంకోర్టులో పిటీషన్లను దాఖలు అయ్యాయి. విచారణ ముగిసిన తరువాతే ఆరోపణలను ఎదుర్కొంటున్న వారిని అరెస్టు చేయాల్సి ఉంటుందని సవరణ చట్టంలో పొందుపరిచింది.
విచారణ అనంతరమే అరెస్టులు..
ఎలాంటి విచారణ చేపట్టకుండా ఆరోపణలను ఎదుర్కొంటున్న వారిని అరెస్టు చేయడం వల్ల ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం దుర్వినియోగమౌతోందనే ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ప్రభుత్వం ఈ సవరణలను చేపట్టింది. ఆరోపణలను ఎదుర్కొంటున్న వారిని.. ఎలాంటి విచారణ చేపట్టకుండానే నిందితుడిగా గుర్తించడం గానీ, అరెస్టు చేయడం గానీ సరికాదని అభిప్రాయపడింది. విచారణ సందర్భంగా సదరు వ్యక్తిపై వచ్చిన ఆరోపణలు గానీ, కేసులు గానీ నిజమైనవేనని తేలితే అరెస్టు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.