మోదీ సర్కారుపై వ్యాక్సిన్ పిడుగు -పూర్తి డేటా హిస్టరీ ఇవ్వండన్న సుప్రీంకోర్టు -అసాధారణ ఆదేశాలు
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి గందరగోళంగా మారి, కేంద్రం-రాష్ట్రాలు, ప్రభుత్వాలు-ప్రజల మధ్య అగాధం రోజురోజుకూ పెద్దదవుతోన్న నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక చర్యకు ఉపక్రమించింది. కొవిడ్ సంబంధిత అంశాలను సుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. కేంద్రం అనుసరిస్తోన్న జాతీయ వ్యాక్సిన్ విధానాన్ని తూర్పారపట్టింది. కొన్ని వయసుల వారికి ఉచితంగా, మెజార్టీ వర్గాల నుంచి రుసుము వసూలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. అసలు వ్యాక్సిన్ల కొనుగోళ్లు, పంపిణీ, అర్హులైనవారి జాబితా సహా సమగ్ర వివరాలతో కూడిన డేటాను తమ ముందుంచాలంటూ కోర్టు ఆదేశాలిచ్చింది..
32 పేజీల ఉత్తర్వులు..
కొవిడ్ సంబంధిత అంశాలపై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ రవీంద్రభట్ ధర్మాసనం రోజువారీ విచారణలు చేస్తున్నది. దేశం మొత్తానికి వ్యాక్సిన్ల అందజేత ఈ ఏడాది చివర్లోగా పూర్తిచేస్తామని, డిసెంబర్ లోగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవుతుందని మంగళవారం నాటి విచారణలో కేంద్రం తెలపగా, బుధవారం నాటి విచారణలో కేంద్రం తీరుపై సుప్రీం నిప్పులు చెరిగింది.
45ఏళ్లు పైబడినవారికి ఉచితంగా టీకాలిస్తూ, అత్యధిక జనాభా వర్గమైన 18-44 ఏళ్ల వారి నుంచి మాత్రం రుసుము వసూలు చేయడం దారుణమని వ్యాఖ్యానించింది. అసలు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంత జఠిలంగా మారడానికి దారితీసిన పరిస్థితులను తామే పరిశీలిస్తామన్న కోర్టు.. కేంద్రం వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించిన తొలి రోజు నుంచి ఇప్పటి దాకా చేసిన అన్ని పనులు, తీసుకున్న అన్ని నిర్ణయాల తాలూకు పూర్తి డేటాను కోర్టు ముందుంచాలని చంద్రచూడ్ ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు బుధవారం 32 పేజీల ఉత్తర్వులను జారీ చేసింది. అందులో..
అసలేం జరిగింది, ఎలా, ఎందుకు..
వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబందించి సుప్రీంకోర్టు కేంద్రానికి జారీ చేసిన 32 పేజీల ఉత్తర్వుల్లో.. తొలి దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ నుంచి ప్రస్తుతం కొనసాగుతోన్న మూడో దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ వరకు ఒక డోసు, రెండో డోసుల టీకాలు తీసుకున్న జనాభా శాతాన్ని, అందులో గ్రామీణులు ఎంతమంది? పట్టణ ప్రాంతం వాళ్లు ఎంత మంది? అనే వివరాలతోపాటు ఇప్పటివరకు కేంద్రం కొనుగోలు చేసిన, లేదా కొనగోలుకు ఆర్డర్ పెట్టిన వ్యాక్సిన్ల డేటా మొత్తాన్ని కోర్టు ముందుంచాలని ఆదేశించింది. దేశంలో అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన మూడు (కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వి) వ్యాక్సిన్లకూ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని కోర్టు పేర్కొంది. అలాగే,
మోదీ సర్కార్ది నిరంకుశం,అహేతుకం -వ్యాక్సిన్లు అమ్మడమేంటి? -వాళ్లు పౌరులు కారా? : సుప్రీం సంచలనం
అఫిడవిట్ రూపంలో వ్యాక్సిన్ డేటా
ఈ మూడు (కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వి) వ్యాక్సిన్ల కోసం కేంద్రం పెట్టిన ఆర్డర్లు, సేకరణకు సంబంధించిన ఉత్తర్వుల తేదీలు, ఆయా రోజుల్లో ఆదేశించిన వ్యాక్సిన్ల పరిమాణం, సరఫరా జరిగిన తీరు, ఏయే రాష్ట్రానికి, కేంద్రపాలిత ప్రాంతాలకు ఎన్నెన్ని డోసులు పంపారు? కేంద్రం స్వయంగా ఎందరికి వ్యాక్సిన్లు వేసింది? తదితర వివరాలన్నిటినీ అఫిడవిట్ రూపంలో రెండు వారాల్లోగా సమర్పించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
పైపై వివరాలతో కోట్ లతో కూడిన కాగితాలను చూపించడం కంటే, వ్యాక్సినేషన్ ప్రక్రియ డేటా మొత్తాన్ని అఫిడవిట్ రూపంలోనే సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ''పెద్ద మొత్తంలో కొంటున్నందుకే మాకు వ్యాక్సిన్లు తక్కువ ధరకు లభిస్తున్నాయని చెబుతోన్న కేంద్రం.. ఇదే హేతుబద్ధత అయితే, మరి రాష్ట్రాలు ఎందుకు ఎక్కువ ధర చెల్లించాలి? దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లకు ఒక ధర ఉండాలి కదా'' అని కీలక ప్రశ్నలు సంధించింది. ఇప్పటికే వ్యాక్సినేషన్ విషయంలో విపక్షాలు, సాధారణ ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న మోదీ సర్కార్, ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది.