అగ్నిపథ్ పిటీషన్లపై సుప్రీంకోర్టు నిర్ణయం ఇదే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారి తీసిన పథకం.. అగ్నిపథ్. సైన్యంలో చేపట్టదలచిన నియామకాలకు ఉద్దేశించిన ఈ పథకం పట్ల ఉత్తరాది మొదలుకుని దక్షిణాది రాష్ట్రాల వరకూ చాలా చోట్ల ఈ పథకానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చెలరేగాయి. దీనికి వ్యతిరేకంగా అల్లర్లకు పాల్పడ్డారు నిరుద్యోగులు. రైల్వే ఆస్తులను లక్ష్యంగా చేసుకున్నారు. విధ్వంసానికి పాల్పడ్డారు. తెలంగాణ, బిహార్, పశ్చిమబెంగాల్, హర్యానా.. వంటి పలు రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లపై దాడులు చోటు చేసుకున్నాయి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరుద్యోగులు రైళ్లకు నిప్పటించారు. ఈ ఘటనలో పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చోటు చేసుకున్న విధ్వంసం వెనుక సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు ప్రమేయం ఉన్నట్లు పోలీసులున నిర్ధారించారు. 12 బ్రాంచ్ల అకాడమీ అభ్యర్థులతో వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకుని, రెండువేల మందికి పైగా ఆందోళనకారులతో విధ్వంసం సృష్టించారని పోలీసులు అనుమానిస్తోన్నారు.
ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. ఈ ఉదయం జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం విచారించింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చుతూ ఈ పిటీషన్లు వేశారు. పలు రాష్ట్రాల హైకోర్టుల్లోనూ పిటీషన్లు దాఖలయ్యాయి. కేరళ, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, బిహార్, ఉత్తరాఖండ్లల్లో పిటీషన్లు విచారణ దశలో ఉన్నాయి. కోచిలోని ఆర్మ్డ్ ఫోర్స్ ట్రిబ్యునల్లోనూ పిటీషన్లు ఉన్నాయి.
ఒకే అంశంపై వేర్వేరు రాష్ట్రాల్లో వివిధ దశల్లో పిటీషన్లు విచారణలో ఉన్న సమయంలో దీన్ని విచారించడం సరికాదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. తమ వద్ద ఉన్న పిటీషన్లను కూడా ఢిల్లీ హైకోర్టుకు బదలాయించింది. తమ వద్ద మూడు రిట్ పిటీషన్లు విచారణకు వచ్చాయని, వాటిని ఢిల్లీ హైకోర్టుకు బదలాయిస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం తరఫున వాదనలను వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు ఈ విషయాన్ని వివరించింది.