Breaking : ఈడీ అరెస్టు, అటాచ్, సెర్చ్, సీజ్ అధికారాలపై సుప్రీం క్లారిటీ-మనీలాండరింగ్ కేసుల్లో
దేశవ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతున్న మనీలాండరింగ్ వ్యవహారాల నేపథ్యంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చర్యల్ని మరింత బలోపేతం చేసేలా సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పునిచ్చింది. మనీలాండరింగ్ కేసుల్లో నిందితుల అరెస్టు సహా ఈడీకి ఉన్న పలు అధికారాల్ని సమర్ధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈడీ చేసే అరెస్టు, జప్తు, దర్యాప్తు ప్రక్రియను సవాలు చేస్తూ పీఎంఎల్ఏ నిబంధనలకు వివరణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
ఈడీ కేసుల్లో అరెస్టు, అటాచ్మెంట్ అధికారాలకు సంబంధించిన మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002లోని నిబంధనలను సుప్రీంకోర్టు ఇవాళ సమర్థించింది. ఈడీ అధికారాలకు సంబంధించి పీఎంఎల్ఏ లోని సెక్షన్ 5, 8(4), 15, 17, 19 నిబంధనల యొక్క రాజ్యాంగబద్ధతను కోర్టు సమర్థించింది. పిఎంఎల్ఎ చట్టంలోని సెక్షన్ 45లో బెయిల్ కోసం ఉన్న జంట షరతులను సైతం సుప్రీంకోర్టు సమర్థించింది. అలాగే ఇందులో పేర్కొన్న నిబంధనలను సవరించడానికి పార్లమెంటుకు అధికారం ఉందని పేర్కొంది. ఈడీ అధికారులు పోలీస్ అధికారులు కాదని అందువల్ల చట్టంలోని సెక్షన్ 50 కింద వారు నమోదు చేసిన వాంగ్మూలాలు కొట్టబడవని కోర్టు పేర్కొంది.
ఈడీ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) వంటి దర్యాప్తు సంస్థలు పోలీసులు కాదని అందువల్ల విచారణ సమయంలో వారు నమోదు చేసిన వాంగ్మూలాలు చెల్లుబాటు అయ్యే సాక్ష్యాలని బెంచ్ తన తీర్పులో పేర్కొంది. ఈడీఅధికారులు సీఆర్పీసీ కింద పోలీసు అధికారులు కాదని, ఈడీ అధికారుల ముందు నమోదు చేసిన స్టేట్మెంట్లు సాక్ష్యంగా చెల్లుబాటు అవుతాయని బెంచ్ పేర్కొంది. మనీలాండరింగ్ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకునే సమయంలో ఈడీ అధికారులు అరెస్టు చేయడానికి గల కారణాలను వెల్లడించడం తప్పనిసరి కాదని కూడా పేర్కొంది. నిందితులకు ఈసీఐఆర్ (ఫిర్యాదు కాపీ) ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని కోర్టు పేర్కొంది. పీఎంఎల్ఏ చట్టం ప్రకారం మనీలాండరింగ్ అనేది స్వతంత్ర నేరమని పేర్కొన్న ధర్మాసనం.. ఇది ఈసీఐఆర్ ఎఫ్ఐఆర్తో సమానం కాదని తెలిపింది. ముందస్తు నేరంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం దీని పరిధిలోకి రాదని వెల్లడించింది.