మీకిష్టం లేని నిర్ణయం తీసుకునే పరిస్ధితి తేవొద్దు ! కేంద్రానికి సుప్రీం హెచ్చరిక...
దేశవ్యాప్తంగా పలు హైకోర్టుల్లో న్యాయమూర్తుల బదిలీలు, నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం పంపిన ప్రతిపాదనల్లో కేంద్రం తమకు ఇష్టమైన వాటిని మాత్రమే ఆమోదించడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొలీజియం ప్రతిపాదనల్లో మీకు నచ్చిన వాటిని మాత్రమే ఆమోదించడం ఏంటని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఇదే తీరు కొనసాగిస్తే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
అత్యున్నత న్యాయవ్యవస్థ నియామకానికి కొలీజియం సిఫారసు చేసిన న్యాయమూర్తుల పేర్లను కేంద్రం ఎంపిక చేసి ఆమోదించడం ఇబ్బందికరమని సుప్రీంకోర్టు ఇవాళ పేర్కొంది. న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం ఒక హైకోర్టు నుండి మరొక హైకోర్టుకు బదిలీ చేయడానికి సిఫార్సు చేసిన పేర్లను కేంద్రం పెండింగ్పై పెట్టడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ కోర్టు లేదా కొలీజియం ప్రభుత్వానికి రుచించని ఏదైనా నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితి రాదని తాము ఆశిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.

న్యాయమూర్తుల నియామకం మరియు బదిలీల కోసం కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను క్లియర్ చేయడంలో కేంద్రం జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు ఇవాళ విచారించింది. ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న కొలీజియం పేర్ల సమస్యపై కూడా జస్టిస్ కౌల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని నియామకాలు జరిగితే, కొన్ని జరగకపోతే, ఇది మళ్లీ ఆందోళన కలిగించే అంశమని అటార్నీ జనరల్కు స్పష్టం చేశారు. కొలీజియం నియామకానికి పేర్లు సిఫార్సు చేసిన వారి సీనియారిటీని ఈ ఎంపిక ప్రభావితం చేస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.
ఇకనైనా కేంద్రం కొలీజియం పంపిన జడ్జీల పేర్లను ఆమోదిస్తుందని ఆశిస్తున్నట్లు సుప్రీంకోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది. దీనిపై కేంద్రంతో మాట్లాడాలని అటార్నీజనరల్ వెంకటరమణికి సూచించింది. కొలీజియం సూచించిన నియామకాలు మాత్రం తక్షణం జరగాల్సిందేనని జస్టిస్ కౌల్ తేల్చిచెప్పారు.












Click it and Unblock the Notifications