మహారాష్ట్రలో బలపరీక్ష-కాసేపట్లో సుప్రీం విచారణ-బీజేపీకి రాజ్ థాక్రే మద్దతు-రేపు ముంబైకి షిండే
మహారాష్ట్రలో శివసేనలో తలెత్తిన తిరుగుబాటు నేపథ్యంలో గవర్నర్ నిర్ణయం మేరకు రేపు బలపరీక్ష జరగబోతోంది. ఇందుకోసం సీఎం ఉద్ధవ్ థాక్రే వర్గంతో పాటు ఏక్ నాథ్ షిండే వర్గం కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు ఉద్ధవ్ కు రాజకీయ శత్రువు, కజిన్ కూడా అయిన ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాక్రే బీజేపీకి తన మద్దతు ప్రకటించారు. అటు బలపరీక్ష కోసం గవర్నర్ రాసిన లేఖను సవాల్ చేస్తూ శివసేన దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు కాసేపట్లో విచారణ జరపనుంది.
బలపరీక్షపై సుప్రీంకోర్టు విచారణ
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) ప్రభుత్వానికి రేపు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని మహారాష్ట్ర గవర్నర్ ఆదేశించడాన్ని సవాల్ చేస్తూ శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు వేసిన పిటిషన్ను సాయంత్రం 5 గంటలకు విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. రేపు ఉదయం 11 గంటలకు మెజారిటీ నిరూపించుకోవాలని ఎంవీఏ ప్రభుత్వాన్ని కోరుతూ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ తీసుకున్న నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని అత్యవసర విచారణ అవసరమని సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వీ చేసిన వ్యాజ్యాలను న్యాయమూర్తులు సూర్యకాంత్, జేబీ పార్దివాలాతో కూడిన వెకేషన్ బెంచ్ అంగీకరించింది.
ఏక్ నాథ్ షిండే ధీమా
రెబల్ శివసేన నేత ఏక్నాథ్ షిండే తన సొంత పార్టీకి చెందిన 50 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతు తనకుందని ప్రకటించారు. వారు ఏ బలపరీక్షలో అయినా గెలుస్తారన్నారు. ఇవాళ రెండోసారి గౌహతిలోని కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన షిండే .. తమతో 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, శాసనసభ్యులలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది ఉన్నారన్నారు. తాము బలపరీక్షపై చింతించబోమన్నారు. తాము పరీక్షలో గెలుస్తామన్నారు. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించినా. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) ప్రభుత్వాన్ని బలపరీక్ష నిర్వహించాలని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ కోరారు.
కీలక పరిణామాలు
రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాక్రే అసెంబ్లీలో తమకున్న ఏకైక ఎమ్మెల్యే మద్దతు బీజేపీకేనని ప్రకటించారు. మరోవైపు క్రిమినల్ కేసుల్లో జైలు జీవితం గడుపుతున్న మాజీ మంత్రులు అనిల్ దేశ్ ముఖ్, నవాబ్ మాలిక్ తాము ఈ బలపరీక్షలో ఓఠు వేసేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టును కోరారు. దీనిపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ప్రకటించే అవకాశం ఉంది. అయితే సుప్రీంకోర్టు బలపరీక్షపై ఇచ్చే తీర్పు ఆధారంగా ఈ పిటిషన్ ఆధారపడి ఉంది. దీంతో బలపరీక్షపై తీర్పు తర్వాత ఈ పిటిషన్ విచారరించే అవకాశముంది.