బాలీవుడ్ హీరో మాజీ మేనేజర్ ఆత్మహత్య.. 14వ అంతస్తు నుంచి దూకి..
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సలియన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం(జూన్ 8)న ముంబైలోని ఓ అపార్ట్మెంట్ 14వ అంతస్తు నుంచి దూకి ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె ప్రాణాలు విడిచినట్టు వైద్యులు నిర్దారించారు.
దిశా ఆత్మహత్యకు కారణాలేంటన్నది ఇంకా తెలియరాలేదు. ఆమె ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఆమెకు కాబోయే భర్తతో ఉన్నట్టు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి,ఆమె తల్లిదండ్రుల నుంచి వాంగ్మూలం సేకరించారు.
కెరీర్ ఆరంభంలో పబ్లిక్ రిలేషన్ మేనేజర్గా పనిచేసిన దిశ.. ఆ తర్వాత సెలబ్రిటీ టాలెంట్ మేనేజర్గా మారారు.ప్రస్తుతం బంటీ సజ్దేశ్ కార్నర్ స్టోన్ స్పోర్ట్స్&ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్తో ఆమె పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో సుశాంత్ సింగ్తో పాటు భారతీ శర్మ,వరుణ్ శర్మ తదితర నటీనటులకు ఆమె మేనేజర్గా పనిచేశారు.