కేంద్ర ఎన్నికల సంఘానికి కొత్త చీఫ్ కమిషనర్: బాధ్యతల స్వీకరణ: అందులో ఎక్స్పర్ట్
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘానికి కొత్త ప్రధాన కమిషనర్గా సుశీల్ చంద్ర నియమితులయ్యారు. కొద్దిసేపటి కిందటే ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఇదివరకు ఆయన పని చేసిన సునీల్ అరోరా పదవీ కాలం ముగిసింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన 24వ ప్రధాన కమిషనర్. వచ్చే ఏడాది మే 14వ తేదీ వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు సుశీల్ చంద్ర సారథ్యాన్ని వహించే అవకాశం ఉంది.
2019లో సుశీల్ చంద్ర ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు. అంతకుముందు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఛైర్మన్గా సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. 1980 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి ఆయన. 1957లో జన్మించారు. రూర్కీ విశ్వవిద్యాలయం నుంచి బీటెక్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు. అనంతరం డెహ్రాడున్లోని డీఏవీ కాలేజీలో ఎల్ఎల్బీ చదివారు. సీబీడీటీ ఛైర్మన్గా ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన పలు కీలకమైన పాలసీలను రూపొందించారు.
ఎన్నికల కమిషనర్గా నియమితులు కావడానికి ముందు- రెవెన్యూ సర్వీసెస్ అధికారిగా అత్యధికంగా పన్నలను చెల్లించే రాష్ట్రాల్లో సుశీల్ చంద్ర సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. వచ్చే ఏడాది కీలకమైన ఏడు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొత్తానికీ ఆయనే సారథ్యం వహిస్తారు. రాజకీయంగా అవన్నీ కీలక రాష్ట్రాలే.
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి నాలుగు దశల ప్రక్రియ సుశీల్ చంద్ర పర్యవేక్షణలోనే కొనసాగుతుంది. ఎన్నికల కమిషనర్గా 2019లో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, ఆ మరుసటి ఏడాది ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది. పశ్చిమ బెంగాల్ అయిదో విడతతో పాటు ఏపీలో తిరుపతి లోక్సభ, తెలంగాణలో నాగార్జున సాగర్ అసెంబ్లీ సహా ఇతర రాష్ట్రాల్లో ఈ నెల 17వ తేదీన పోలింగ్ నిర్వహించాల్సి ఉంది.