రాజకీయ ఆరంగేట్రం చేసిన సుష్మా స్వరాజ్ కూతురు బాన్సురీ స్వరాజ్!!
రాజకీయాల్లో తన మార్కు చూపించిన, దివంగత కేంద్ర మాజీమంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె బాన్సురీ స్వరాజ్ తల్లి అడుగుజాడల్లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కేంద్ర విదేశాంగ శాఖ మాజీ మంత్రి అయిన సుష్మా స్వరాజ్ వారసురాలిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆమె ఢిల్లీ బిజెపి లీగల్ సెల్ కో కన్వీనర్ గా నియమితులయ్యారు.
విద్యాధికురాలైన బాన్సురీ స్వరాజ్ బిజెపి పార్టీ ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బాన్సురీ స్వరాజ్ వార్ విక్ యూనివర్సిటీలో ఇంగ్లీషు సాహిత్యంలో డిగ్రీ పొందారు. ఆపై లండన్ బిజెపి లా స్కూల్లో న్యాయవిద్యను అభ్యసించారు. బారిస్టర్ లా పూర్తిచేసిన బాన్సురి స్వరాజ్ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశారు. అంతర్జాతీయ వాణిజ్య ఆర్బిట్రేషన్లు, రియల్ ఎస్టేట్, టాక్స్, క్రిమినల్ కేసులను వాదిస్తున్న బాన్సురి స్వరాజ్ హర్యానా రాష్ట్రానికి అదనపు అడ్వకేట్ జనరల్ గా పనిచేస్తున్నారు.

ఆరు సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్న బాన్సురి స్వరాజ్ గతంలో కూడా అనధికారికంగా బిజెపికి న్యాయ సలహాలు, సూచనలు చేస్తూ వచ్చారు. అయితే తాజాగా ఆమె బిజెపిలో క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఢిల్లీ న్యాయవిభాగానికి బిజెపి కో కన్వీనర్ గా పార్టీ పదవిని స్వీకరించటం మాత్రం ఇదే తొలిసారి. తనకు ఢిల్లీ బిజెపి లీగల్ సెల్ కో కన్వీనర్ గా నియమించడం పట్ల బాన్సురీ స్వరాజ్ సంతోషం వ్యక్తం చేశారు. బిజెపి సీనియర్ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర బిజెపి లీగల్ సెల్ రాష్ట్ర కోకన్వీనర్ గా పార్టీకి సేవ చేసే అవకాశం కల్పించడం పట్ల ఆమె ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర మంత్రి అమిత్ షాకు, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రెటరీ బిఎల్ సంతోష్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. సుష్మా స్వరాజ్ ను తన తల్లిగా చేసినందుకు గత జన్మలో తాను పుణ్యం చేసి ఉంటానని బాన్సురీ స్వరాజ్ పేర్కొన్నారు. తన శక్తి మేరకు పార్టీ అప్పగించిన బాధ్యతను నిర్వర్తిస్తానని, తన తల్లి బాటలో తన ప్రయాణం సాగుతుందని తెలిపారు. మరి క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టిన బాన్సురీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? ఆమె రాజకీయ ప్రయాణం ఎలా సాగుతుంది? అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications