టిడిపితో పొత్తున్న టికే: సుష్మా, ఇప్పుడే కాదన్న బాబు
ఇతర పార్టీల నేతలతో సమావేశమైనట్లే రాజ్నాథ్తో కూడా చంద్రబాబు సమావేశమయ్యారన్నారు. అవసరాన్ని బట్టి పొత్తులు ఎవరితోనైనా ఉండవచ్చునని, అది భవిష్యత్తు నిర్ణయిస్తుందన్నారు. పొత్తులు ఉంటాయా, ఉండవా, ఎవరితో ఉంటాయి, ఎవరితో ఉండవనే అంశంతో సంబంధమే లేదని, తెలంగాణపై తమ వైఖరికి కట్టుబడి ఉంటామన్నారు. శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.
"పార్లమెంటు శీతాకాల సమావేశాలకు మరో రెండు నెలలు గడువు ఉంది. ఆలోపు ఎలాంటి చర్చలు జరుపుతారో జరుపుకోండి. సమస్యలు పరిష్కరించండి. కానీ, బిల్లు తెండి. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ అనే బిల్లు ఉండాలి. సిడబ్ల్యూసి చేసిన తీర్మానం ప్రకారమే బిల్లు ఉండాలి. అప్పుడు బిజెపి బేషరతుగా తన మద్దతు ఇస్తుంది. కేంద్రం ఆ విధంగా చేస్తే... విజయోత్సవాల్లో పాల్గొనేందుకు తెలంగాణకు వస్తాను. లేదంటూ మరోసారి మోసం చేస్తే... మలిదశ ఉద్యమంలో పాల్గొనేందుకు స్వయంగా వస్తాను'' అని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు డిసెంబర్లో ముగియనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలను డెడ్లైన్గా విధించారు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో తెలంగాణ ప్రజలు విజయం సాధించినట్లేనన్నారు. దీనిపై ఆనందంగా ఉన్నా, గత అనుభవాల నేపథ్యంలో ఏదో ఒక మూల సందేహం కూడా ఉందన్నారు. తెలంగాణ ప్రజలు పలుసార్లు మోసపోయారని మరోసారి మోసం చేస్తే సహించబోరని హెచ్చరించారు. చివర్లో 'జై తెలంగాణ జై సీమాంధ్ర' అని నినదించిన సుష్మ తన ప్రసంగంలో విభజన తర్వాత కూడా ఇరుప్రాంతాల వారు కలిసి ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.
సుష్మ తెలంగాణకు బతుకమ్మ : కోదండరాం
తెలంగాణ పర్యటనకు బతుకమ్మలాగా సుష్మా స్వరాజ్ వచ్చారని తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరాం అభివర్ణించారు. ఆంధ్ర పాలకులపై, కేంద్ర ప్రభుత్వంపై, సిఎంపై గర్జించాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. ఒక్క కిరణ్ కాదు వెయ్యి మంది కిరణ్లు అడ్డుపడినా తెలంగాణ వచ్చి తీరుతుందని స్పష్టం చేశారు. మనమంతా సంఘటితమైతే ఎన్ని శక్తులు ఒక్కటయినా, ఎంతమంది ఒక్కటైనా, ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణను ఆపలేరని అన్నారు. ప్రజా గర్జనలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తెచ్చుకునే శక్తి, తెలివి ఇక్కడి ప్రజలకు ఉందన్నారు.
ఎవరిని కలుపుకుపోతామో ఇప్పుడే చెప్పలేం: చంద్రబాబు
పొత్తులపై టిడిపితో చర్చలు జరగలేదని సుష్మా స్వరాజ్ చెప్పగా.. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాదులో అదే చెప్పారు. ఎన్నికల సమయంలో తాము ఎవరెవరిని కలుపుకుపోతామో ఇప్పుడే చెప్పలేమన్నారు. కాంగ్రెసు పార్టీ ఇంటికి పోతేనే దేశానికి రక్షణగా ఉంటుందన్నారు. తనను మోడీ, కురియన్లు అక్టోబర్ 2న సమావేశానికి ఆహ్వానించారని, యువతను ఉద్దేశించి ప్రసంగించడం కోసం దానికి హాజరవుతున్నట్లు చెప్పారు.