ట్వీట్: విదేశాల్లో ఉన్న మరో ఇద్దరికి సుష్మా స్వరాజ్ సాయం
ఆపదలో ఉన్నామని ట్వీట్ చేస్తే వెంటనే స్పందిస్తారు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్. ఇటీవల మలేషియాలో చిక్కుకుపోయిన భారతీయులకు సాయం చేసి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.
న్యూఢిల్లీ: ఆపదలో ఉన్నామని ట్వీట్ చేస్తే వెంటనే స్పందిస్తారు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్.
ఇటీవల మలేషియాలో చిక్కుకుపోయిన భారతీయులకు సాయం చేసి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.
భారత్కు చెందిన ఓ కుటుంబం మలేషియా వెళ్లింది. తిరిగి వచ్చే సమయంలో వారు పాస్పోర్టులు పోగొట్టుకున్నారు. మలేషియా విమానాశ్రయంలో చిక్కుకుపోయారు.

దీంతో మీరా రమేష్ పటేల్ అనే మహిళ సుష్మా స్వరాజ్కు ట్వీట్ చేశారు. మేడమ్, మా కుటుంబం పాస్పోర్టులు పోగొట్టుకున్న కారణంగా మలేషియా విమానాశ్రయంలో చిక్కుకుపోయిందని, వారాంతం కావడంతో భారత దౌత్య కార్యాలయం తెరుచుకోలేదని, దయచేసి ఆదుకోవాలని ట్వీటర్లో వేడుకొంది.
దీనిపై సుష్మా వెంటనే స్పందించారు. కార్యాలయం తెరిచి మలేషియాలో చిక్కుకున్న భారత కుటుంబానికి సాయం చేయండని దౌత్య కార్యాలయ అధికారిని ఆదేశిస్తూ ట్వీట్ చేశారు. కొద్దిసేపటికే బాధిత కుటుంబం సంప్రదించిందని, సమస్య పరిష్కారమైందని దౌత్య కార్యాలయం మంత్రికి ట్వీట్ చేసింది.
అలాగే అమెరికాలో చదువుతున్న అనూష ధూళిపాళ్ల అనే విద్యార్థిని పాస్పోర్టు పోగొట్టుకున్నారు. దీంతో ఆమె తనకు సహాయం కావాలని, తాను భారత్కు వెళ్లి వీసా పొందాలని, ఇది తనకు పరీక్షా సమయమని, పాస్పోర్టు లేకుండా ప్రయాణించలేనని ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన సుష్మా అనూషా మీ సమస్యపై అమెరికాలోని దౌత్య కార్యాలయంలో మాట్లాడానని ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications