అనుమానంతో భార్యను కత్తితో పొడిచాడు, కొడుకు చూశాడని ఆత్మహత్య
వివాహేతర సంబంధం అనుమానంతో రాజేంద్రసింగ్ అనే వ్యాపారి తన భార్యను కత్తితో పొడిచాడు. ఈ ఘటనను కొడుకు చూశాడు. తనభార్యను చంపుతుండగా కొడుకు చూశాడని ఆయన బాల్కనీ నుండి దూకి ఆత్మహత్య చేసుకొన్నాడు.
ముంబాయి : అనుమానం పెనుభూతమైంది. ఈ అనుమానం కారణంగా నే పలు మార్లు భార్యతో గొడవపెట్టుకొనేవాడు.గతంలో అరెస్టు కూడ అయ్యాడు. కాని, ప్రవర్తనలో మార్పు రాలేదు. వివాహేతర సంబంధం అనే అనుమానంతో భార్యను కత్తితో పొడిచాడు. అయితే తాను తన భార్యను కత్తితో పొడుస్తుండగా కొడుకు చూశాడనే భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ వ్యాపారి . ఈ ఘటన ముంబాయిలో చోటుచేసుకొంది.
ముంబాయిలో ఉండే రాజేంద్ర సింగ్ వ్యాపారవేత్త,. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజేంద్ర సింగ్ కు భార్యపై అనుమానం ఉండేది. తన భార్య వివాహేతర సంబంధాలు కొనసాగిస్తోందని ఆయన అనుమానించాడు.ఇదే విషయమై భార్యను పలుమార్లు వేధించాడు. వివాహేతర సంబంధాల పేరుతో భర్త తనను వేధిస్తున్నాడని రాజేంద్రసింగ్ సతీమణి సంగీత పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆమె ఫిర్యాదు మేరకు రాజేంద్రసింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్ పై వచ్చిన తర్వాత కొంత కాలం బాగానే ఉన్నాడు. కాని, ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదని అనుమానించాడు. ఈ అనుమానంతో ఆమెను అంతం చేయాలని భావించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం కోసం ఎదురుచూశాడు.
తన కొడుకు చేతన్ ఇంటి నుండి బయటకు వెళ్ళగానే భార్య గదిలోకి వెళ్ళి కత్తితో ఆమెను పొడిచాడు. దీంతో ఆమె అరిచింది. ఈ అరుపులకు బయటనే ఉన్న చేతన్ ఇంట్లోకి వచ్చి తల్లి గది తలుపులు తీయబోయాడు. తలుపులు తెరుచుకోలేదు. బాత్రూమ్ కిటీకిలు పగులగొట్టి లోపలకి వచ్చాడు చేతన్. అప్పడు తల్లిని కత్తితో పొడుస్తున్న తండ్రిని గమనించాడు.
తన భార్యను తాను పొడుస్తుండగా కొడుకు చూడడంతో రాజేంద్రసింగ్ భయానికి గురయ్యాడు. వెంటనే ఆయన ఆ గదిలో నుండి బయలకు వెళ్ళిపోయాడు. బాల్కనీ నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకొన్నాడు. సంగీత ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది.