మమతా బెనర్జీ ఆమెపై ఉన్న క్రిమినల్ కేసులు దాచారు: ఈసీకి సువేందు అధికారి ఫిర్యాదు
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. నందిగ్రామ్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ఇటీవల నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆమెపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కూడా కొద్ది రోజుల క్రితం నామినేషన్ దాఖలు చేశారు.
రూ.1300 కోట్లు మీవే కావొచ్చు: ఈ బుధవారమే పవర్బాల్ లాటరీ..ఎలా ఆడాలంటే..?
కాగా, మార్చి 10న నందిగ్రామ్ నుంచి మమతా బెనర్జీ దాఖలు చేసిన నామినేషన్పై ప్రత్యర్థి సువేందు అధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. మమతపై ఆరు క్రిమినల్ కేసులు ఉన్నప్పటికీ ఆమె వాటిని అఫిడవిట్లో పేర్కొనలేదని ఈసీకి ఫిర్యాదు చేశారు. పశ్చిమబెంగాల్లో ఒక సీబీఐ కేసుతోపాటు అసోంలో ఆమెపై ఐదు క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఆరోపించిన ఆయన.. ఈసీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆ తర్వాత సువేందు అధికారి మీడియాతో మాట్లాడారు. పూర్తి సమాచారం ఇవ్వని మమతా బెనర్జీ నామినేషన్ను తిరస్కరించాలని ఈసీని కోరినట్లు ఆయన తెలిపారు. అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పారు. అధికారులు చర్యలు తీసుకునేంత వరకు వేచి ఉంటానని, చట్టపరంగానే చర్యలు ఉండాలన్నారు.
నిబంధనలు ఎవరికైనా ఒకటేనని, తన బాధ్యతగా ఈసీకి అన్ని ఆధారాలూ సమర్పించానని చెప్పారు. మరోవైపు, ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.
కాగా, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో సువేందు అధికారి నందిగ్రామ్ నుంచి గెలుపొందారు. మెడినీపూర్ జిల్లాలోని ఈ నియోజకవర్గం సువేందు అధికారిక కంచుకోట లాంటిది. అందుకే ఏకంగా సీఎం మమతా బెనర్జీ పోటీ చేసినా వెనక్కి తగ్గడం లేదు. ఆమెను 50వేల ఓట్ల మెజార్టీతో ఓడిస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, గత డిసెంబర్ నెలలో సువేందు అధికారి టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. మార్చి నెల 27 నుంచి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 8 దశల్లో జరుగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.