స్వచ్ఛ భారత్: త్వరలో చీపురు పట్టనున్న సానియా
న్యూఢిల్లీ: టెన్నిస్ స్టార్ సానియా మిర్జా త్వరలో చీపురు పట్టనుంది. స్చచ్ఛ భారత్లో భాగంగా రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ అహ్వానాన్ని ఆమె స్వీకరించారు. ఈ సందర్బంగా సానియా మిర్జా మాట్లాడుతూ అనిల్ అంబానీ ఆహ్వానాన్ని స్వీకరిస్తున్నానని, త్వరలో సమయం చూసుకుని సింగపూర్లో జరగనున్న డబ్ల్యూటీఏ చాంపియన్ షిప్కు వెళ్ళే లోపే స్వచ్ఛ్ భారత్లో పాల్గొంటానని తెలిపింది.
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన న్యూఢిల్లీలో స్వచ్ఛ భారత్ను ప్రధాని మోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సినీ నటులను, ప్రముఖులను ఆహ్వానించారు. మోడీ ఆహ్వానించినవారిలో 9 మందిలో బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, ప్రియాంక చోప్రా, శశిథరూర్, సచిన్ టెండూల్కర్, తారక్ మెహతా, అనిల్ అంబానీ, మృదుల సిన్హా, బాబా రాందేవ్ తదితరులు ఉన్నారు.
ప్రధాని మోడీ పిలుపు మేరకు అనిల్ అంబానీ స్వచ్చ భారత్ కార్యక్రమ ప్రాచారంలో పాల్గొన్నారు. రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ముంబైలో చీపురు పట్టి రోడ్లు వూడ్చారు.
అనంతరం బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, ఆసియా గేమ్స్ బంగారు పతక విజేత మేరీకోమ్, సానియా మిర్జాలతో పాటు టాలీవుడ్ మన్మదుడు నాగార్జున, ప్రముఖ కాలమిస్ట్ శోభా డే, జర్నలిస్ట్ శేఖర్ గుప్తా, రచయిత ప్రసూన్ జోషి, రన్నర్ క్లబ్ ఆఫ్ ఇండియాలను స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొని మరింత ముందుకు తీసుకెళ్లాలని అనిల్ అంబానీ వారిని ఆహ్వానించారు.