బీజేపీని 45 సీట్లకే పరిమితం చేస్తాం.. యూపీ సీఎం యోగికి ప్రసాద్ మౌర్య సవాల్
ఉత్తరప్రదేశ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మరో నెలరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న సమయంలో బీజేపీ పార్టీకి షాక్ మీద షాక్ ఇస్తున్నారు పార్టీ నేతలు. వరుసగా ఆపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామాల బాటపడుతున్నారు. ముగ్గురు మంత్రులు సహితం పార్టీకి గుడ్ బై చెప్పారు. సీఎం యోగి పాలనలో ఎన్నో అవమానాలు అనుభవించామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాషాయ పార్టీని వీడిన వీరు.. త్వరలోనే సమాజ్ వాదీ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. బీజేపీ పార్టీని 45 సీట్లకు పరిమితం చేస్తామని సవాల్ విసురుతున్నారు.

బీజేపీని 45 సీట్లకే పరిమితం చేస్తాం..
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ నుంచి బయటకు వచ్చి బీజేపీ రాజీనామా చేసిన మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో భేటీ అయ్యారు. తనతో పాటు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను అఖిలేష్కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీకి, సీఎం యోగి ఆదత్య నాథ్కు సవాల్ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని హెచ్చరించారు. 2017కు ముందు బీజేపీకి ఉన్న 45 సీట్లకే పరిమితం చేస్తామని సవాల్ విసిరారు. త్వరలోనే అఖిలేష్ సమక్షంలో సమాజ్ వాదీ పార్టీలో చేరనున్నట్లు స్వామి ప్రసాద్ మౌర్య తెలిపారు.

అఖిలేష్ యాదవ్తో భేటీ..
యోగి పాలనలో వెనుకబడిన వర్గాలను, దళితులను , మైనార్టీల పట్ల చిన్న చూపు చూశారని ఆరోపించారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని ఆరోపిస్తూ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీకి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఈ మూడు రోజుల్లోనే మరో ఇద్దరు మంత్రులు కూడా ఆయన బాటలోనే కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. వీరితో పాటు ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఇంకా మరికొంత మంది రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రసాద్ మౌర్య తెలిపారు. సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీలో కలవరం
మరోవైపు ప్రతిరోజూ యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్ నుండి రోజుకు ఒకరి నుండి ఇద్దరు మంత్రులు వైదొలుగుతారని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్భర్ జోస్యం చెప్పారు. జనవరి 20 నాటికి ఈ సంఖ్య 18కి పెరుగుతుందని పేర్కొన్నారు. మరో నెలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న సమయంలో వరుసగా మంత్రులు, ఎమ్మెల్యే రాజీనామాలు చేస్తున్నారు. ఇది బీజేపీని కలవరపెడుతోంది. మరి ఎన్నికల్లో గెలుపుకోసం కమలనాథులు ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతున్నారో చూడాలి .. అసెంబ్లీ ఎన్నికలపై వస్తున్న సర్వేలు అన్ని అవాస్తవమని అఖిలేష్ యాదవ్ పేర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications