రాజ్యసభకు స్వపన్ దాస్గుప్తా రాజీనామా -అసెంబ్లీ బరిలో కేంద్ర మంత్రి, సిట్టింగ్ ఎంపీలు -బెంగాల్ బీజేపీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తో హోరాహోరీగా తలపడుతోన్న బీజేపీ అనూహ్యరీతిలో అభ్యర్థులను బరిలోకి దించుతోంది. బెంగాల్ అసెంబ్లీకి ఎమ్మెల్యే అభ్యర్థులుగా కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోతోపాటు ముగ్గురు సిట్టింగ్ ఎంపీల పేర్లను ప్రకటించింది. ఇది వ్యూహాత్మక నిర్ణయమని బీజేపీ అంటుండగా, అభ్యర్థులు దొరకనందుకే కమలం తంటాలు పడుతోందని ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తున్నారు.
రాజ్యసభ ఎంపీ పదవికి స్వపన్ దాస్గుప్తా మంగళవారంనాడు రాజీనామా చేశారు. రాష్ట్రపతి నామినీగా ఎంపీ అయిన దాస్గుప్తాను బీజేపీ ఇప్పుడు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించుతుండటంతో ఆయన రాజీనామా అనివార్యమైంది. తారకేశ్వర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేష్ వేసిన వెంటనే స్వపన్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సదరు లేఖను రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు పంపారు. దీనికి ముందు,

రాష్ట్రపతి చేత నామినేట్ అయిన ఎంపీగా ఉంటూ, బీజేపీ టికెట్ స్వీకరించిన స్వపన్ దాస్గుప్తాను అనర్హుడిగా ప్రకటించాలంటూ తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్పై ఆయన పోటీ చేస్తున్నందున, ఆయన రాజ్యసభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయాలని పేర్కొంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్లమెంటులో కొనసాగేందుకు ఆయనకు అర్హత లేదని టీఎంసీ నేత మహువా మొయిత్రా ఒక ట్వీట్లో పేర్కొన్నారు. కాగా,
తారకేశ్వర్ లో నామినేషన్, ఎంపీ పదవికి రాజీనామా అనంతరం స్వపన్ దాస్గుప్తా మీడియాతో మాట్లాడుతూ.. బెంగాల్ లో మమత పాలనలో హింస, లూటీలు పెరిగాయని, బీజేపీ గెలుపుతోనే వాటికి చరమగీతం పాడగలమని, బెంగాలీలు ప్రశాంతంగా జీవించేలా బీజేపీ చూస్తుందని, అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని గుప్తా చెప్పారు.
తపన్ దాస్ గుప్తాతోపాటు కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో,లోక్ సభ సిట్టింగ్ ఎంపీలు నితీశ్ ప్రమాణిక్, ఎంపీ లాకెట్ చటర్జీలనుకూడా బీజేపీ ఇప్పుడు అసెంబ్లీ బరిలో నిలబెట్టింది. మొత్తం 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి.












Click it and Unblock the Notifications