టెక్కీ స్వాతి హత్య కేసు: రామ్ కుమార్ పోస్టుమార్టంకు ప్రత్యేక టీమ్
చెన్నై: సంచలనం రేపిన ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హత్య కేసు నిందితుడు రామ్ కుమార్ ఆదివారం చెన్నైలోని పుజల్ సెంట్రల్ జైళ్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. జైలులో తనకు కేటాయించిన ప్రత్యేక బరాక్లో కరెంట్ వైర్ను కొరికి ఆత్మహత్య చేసుకున్నాడు.
షాక్: ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హత్య నిందితుడి ఆత్మహత్య, జైల్లో హత్య చేశారని తండ్రి
కుమారుడి మృతిపై తండ్రి పరమశివం అనుమానం వ్యక్తం చేయడంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినతి మేరకు దీనిపై పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు పోస్టుమార్టం ప్రక్రియను నిలిపివేయాలని పోలీసులు, ఆసుపత్రి వైద్యులను మద్రాసు హైకోర్టు ఆదేశించింది.
ఈ మధ్యాహ్నం 2.15 నిమిషాలకు పిటిషన్ విచారణకు రానుంది. విచారణ పూర్త అయి తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు పోస్ట్మార్టం నిర్వహించరాదని జస్టిస్ టీఎస్ శివజ్ఞానం ఆదేశాలు జారీ చేశారు. చెన్నైలోని నుంగంబాకం రైల్వే స్టేషన్లో జూన్ 24న టెక్కీ స్వాతిని హత్య చేసినట్లు అనుమానిస్తున్న రామ్ కుమార్ను జులై 1న అతడి సొంత ఊరైన మీనాక్షిపురంలో పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆ సమయంలో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు రామ్కుమార్ ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. చికిత్స అనంతరం కోర్టు అనుమతితో సెంట్రల్ జైలుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఈ జైలులో రామ్ కుమార్ విద్యుత్ తీగను పట్టుకున్నాడు. అతనిని వెంటనే ప్రభుత్వ రాయపేఠ ఆసుపత్రికి తరలించారు.
అతనిని పరిశీలించిన వైద్యులు రామ్ కుమార్ మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఇదిలా ఉండగా, పోలీసులు అధికారికంగా ఈ హత్యను నిర్ధారించవలసి ఉంది. మరోవైపు రామ్ కుమార్ బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు వస్తుండటంతో ఇంతలోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడు.
రామ్ కుమార్ అనుమానాస్పదంగా మృతిచెందాడని, సమగ్ర విచారణ తర్వాత శవపరీక్ష నిర్వహించాలని దాఖలైన పిటిషన్పై ధర్మాసనం విచారణ జరుపనుంది. రామ్ కుమార్ తండ్రి మాట్లాడుతూ.. తన కొడుకు జైలు అధికారులు తనకు ఫోన్ చేశారని, అతనిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారని, అతను మృతి చెందినట్లుగా ఇంకా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పారు.
కేసును తప్పుదారి పట్టించేందుకు పోలీసులే తన కుమారుడ్ని జైల్లో చంపేశారని తండ్రి పరమశివం ఆరోపిస్తున్నారు. కాగా, రామ్ కుమార్ మృతి పైన తండ్రి, అతని లాయర్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రామ్కుమార్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని, వైద్య కమిటీ సమక్షంలో మృతదేహానికి పోస్టుమార్టం చేయాలని, దీన్ని వీడియోలో చిత్రీకరించాలని బాధితుడి తరుఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
రామ్ కుమార్ పోస్టుమార్టంకు ప్రత్యేక టీమ్
స్వాతి హత్య కేసులో ప్రధాన నిందితుడు రామ్ కుమార్ మరణంపై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. డాక్టర్లు, నిపుణులతో నలుగురు సభ్యుల టీమ్ను ఏర్పాటుచేసి రామ్ కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. రిమాండ్ ఖైదీగా ఉన్న రామ్ కుమార్ పుళల్ జైళ్లో ఆదివారం బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే.