ఆల్ పార్టీలో 'టి' హీట్, వద్దే వద్దు: సుష్మాVsకమల్నాథ్
న్యూఢిల్లీ: మంత్రి కమల్ నాథ్ నేతృత్వంలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో తెలంగాణ బిల్లు పైన వాడిగా వేడిగా చర్చ సాగింది. ఈ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని కాంగ్రెసు నేతృత్వంలోని యూపిఏ ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో అఖిల పక్షం హాట్ హాట్గా సాగింది. ఈ సమావేశాలలో ఓటాన్ అకౌంట్ పెట్టాలని తృణమూల్ కాంగ్రెసు పార్టీ డిమాండ్ చేసింది. కీలకమైన రాష్ట్ర విభజన బిల్లును ఈ సమయంలో పెట్టడం అవసరమా అని సమాజ్ వాది పార్టీ ప్రశ్నించింది.
అసెంబ్లీలో తిరస్కరించిన తెలంగాణ ముసాయిదా బిల్లును ఇప్పుడు పార్లమెంటులో పెట్టడం సరికాదని పలు ప్రాంతీయ పార్టీలు అభిప్రాయపడ్డాయి. తెలంగాణ బిల్లును దూరం పెట్టాలని సూచించాయి. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని, అయితే న్యాయ సమస్యలు రాకుండా చూసి బిల్లు పెట్టాలని బిజెపి సూచించింది. సీమాంధ్రులకు న్యాయం చేయకుండా బిల్లును పెడితే సభ నడపడం కష్టమవుతుందని బిజెపి తెలిపింది.
సోమవారం ఉదయం పదకొండున్నర గంటలకు ప్రారంభమైన అఖిల పక్ష సమావేశం దాదాపు రెండు గంటలు సాగింది. తెలంగాణ బిల్లు సహా 39 బిల్లులను అఖిల పక్షం ముందు ఉంచింది. తెలంగాణ బిల్లును పలు పార్టీలు వ్యతిరేకించడంతో గందరగోళం ఏర్పడింది. దీనిపై కాంగ్రెసు పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది.
సుష్మాVsకమల్నాథ్
తెలంగాణ విషయంలో భారతీయ జనతా పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని కమల్ నాథ్ ఆరోపించారు. బిల్లు ఆమోదానికి తమ వంతు ప్రయత్నాలు తాము చేస్తామన్నారు. తెలంగాణ బిల్లు పెడితే సభ సజావుగా సాగేలా కనిపించడం లేదని సుష్మా స్వరాజ్ అన్నారు. తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని, అలాగే సీమాంధ్రుల సమస్యలు పరిష్కరించాలన్నారు. అధికార పార్టీ ఎంపీలు సభను అడ్డుకుంటున్నారని ఆమె విమర్శించారు.
కాంగ్రెసు పార్టీ మాటను ఆ పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులే వినడం లేదని, ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు. కేంద్రం పార్లమెంటులో పెట్టే అన్ని బిల్లులకు తాము సహకరిస్తామని కానీ మీ ఎంపీలు సభను నడవనిస్తారా అని కమల్ నాథ్ను సుష్మా ప్రశ్నించారు. తెలంగాణ కావాలనుకునే వారు, వద్దనుకునే వారు సమావేశాలను అడ్డుకుంటున్నారని చెప్పారు. విపక్షాలను నిందించి లాభం లేదని చురక వేశారు.