ఇండియాపై తాలిబన్ దాడి: యుద్ధానికి మోదీ సిద్ధంగా ఉండాలి -భారతమాత కోసం తప్పదన్న బీజేపీ స్వామి
దక్షిణాసియాలో కీలక దేశంగా, అటు అమెరికా, ఇటు యూరప్ దేశాల రాజకీయ యుద్ధ తంత్రాలకు కేంద్రంగా ఉంటూ వచ్చిన అఫ్గానిస్థాన్ లో రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటయిన దరిమిలా దానితో సరిహద్దులు పంచుకునే భారత్ పరిస్థితిపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. అధ్యక్షుడు అష్రఫ్ ఘని దేశం విడిచిపారిపోవడం, నెత్తుటి చుక్క లేకుండా గద్దెనెక్కిన తమను అంతర్జాతీయ సమాజం గుర్తించాలని తాలిబన్లు కోరుతున్న క్రమంలో భారత్ పాత్ర కీలకంగా మారింది. ఇప్పటికే తాలిబన్లను గుర్తించబోమన్న ఇండియాకు ఆ ముష్కరుల నుంచి ముప్పు తప్పదని, కాబట్టి ముందస్తుగా మనమే యుద్ధానికి దిగాలని అధికార బీజేపీ నుంచే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. పూర్తివివరాలివి..
Recommended Video

తాలిబన్ల ఘన విజయంతో..
9/11 దాడుల తర్వాత అల్ కాయిదా టెర్రరిస్టు బిన్ లాడెన్ , అతనికి సహకరించే గ్రూపులను అంతం చేయడానికి అమెరికా 2001లో మొదలుపెట్టిన యుద్దం రెండు దశాబ్దాలపాటు సుదీర్ఘంగా కొనసాగడం, అసలు లక్ష్యాలు ఎప్పుడో దారి తప్పగా సైనిక మోహరింపు తలకు మించిన భారం కావడంతో అమెరికా ఇటీవలే అఫ్గాన్ గడ్డపై నుంచి పూర్తిగా వైదొలిగింది. 20 ఏళ్ల కిందట దేశంలో కొన్ని ప్రాంతాలపైనే పట్టున్న తాలిబన్లు ఇప్పుడు మరింత బలపడి, అసలు ప్రతిఘటనే లేకుండా దేశం మొత్తాన్ని ఆక్రమించుకున్నారు. ఆదివారం నాడు రాజధాని కాబూల్ ను చేజిక్కించుకోవడంతో తాలిబన్ల విజయం ఖరారైంది. ప్రస్తుతం ముల్లా బరాదర్ అధ్యక్షుడిగా ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వానికి అంతర్జాతీయ గుర్తింపు లభించేలా దోహా వేదికగా చర్చలను కొనసాగిస్తామని తాలిబన్లు చెబుతున్నారు. ఈ ప్రక్రియ ముగియడానికి కనీసం 10 రోజులైన పట్టొచ్చని తెలుస్తోంది. ఈలోపు..

అఫ్గాన్ లో ఎటు చూసినా కల్లోలమే...
వేల సంఖ్యలో తాలిబన్ సేనలు ఆయుధాలు, యుద్ద ట్యాంకులతో కాబూల్ నగరాన్ని చుట్టుముట్టడం, అధ్యక్షభవనాన్ని సైతం ఆక్రమించుకోవడం, ఎయిర్ పోర్టుల నుంచి చివరి అమెరికా విమానాలు వెళుతోంటే కూడా బయటపడేందుకు వేల మంది సాధారణ పౌరులు ప్రయత్నించడం లాంటి దృశ్యాలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. నిజానికి దోహా చర్చలు ముగిసి, తాలిబన్లకు అధికారికంగా పగ్గాలు దక్కేదాకా సైన్యాలను కాబూల్ సరిహద్దుల్లోనే ఉండాలని నేతలు ఆదిశించినా ఎవరూ పట్టించుకోలేదు. పెద్ద సంఖ్యలో సిటీలోకి చొరబడ్డ తాలిబన్ సేనలు లూటీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఒక్క కాబూల్ సిటీనేకాదు, యావత్ దేశమంతా ఎటుచూసినా కల్లోల వాతావరణమే కనిపిస్తున్నది. లక్షల సంఖ్యలో జనం ఎలాగోలా సరిహద్దులు దాటేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. అయితే,

ఇండియాపై తాలిబన్ల దాడి..
అఫ్గాన్ లో తాలిబన్ రాజ్యం పున:స్థాపనతో ఇండియాకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి హెచ్చరించారు. చాలా కాలంగా అఫ్గాన్-తాలిబన్ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు, లోతైన విశ్లేషణలు చేస్తోన్న ఆయన, తాలిబన్ల తదుపరి ఎత్తుగడలను వివరిస్తూ, భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి కీలక సూచనలు చేశారు. ఇవాళ అఫ్గాన్ లో అధికారాన్ని కైవసం చేసుకున్న తాలిబన్లు ఏడాది తిరిగేలోపే భాతర్ పై దాడి చేస్తారని, అందుకు పాకిస్తాన్, చైనాలు ఉపకరిస్తాయని స్వామి చెప్పారు. ఇండియాపై తాలిబన్ల దాడి తప్పదు కాబట్టి మనమే ముందుగా ఎదురుదాడి చేయాలని, తాలిబన్ వ్యతిరేక శక్తులకు భారత్ లో ఆశ్రయం ఇవ్వడంతోపాటు నేరుగా తాలిబన్లతో యుద్దాన్ని కూడా ప్రకటించాలని ప్రధాని మోదీని ఎంపీ స్వామి కోరారు.

తాలిబన్లపై భారత్ యుద్ధం చేయాలి..
''తాజాగా అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు రాబోయే కొద్ది రోజుల్లోనే తన సిద్దాంతాలను అమలు చేయబోతున్నది. ముందుగా ఆధునిక భావాలున్న, స్వేచ్ఛను కోరుతోన్న గ్రూపులు అన్నిటినీ అంతం చేస్తుంది. తాలిబన్ ఏలుబడిలో ప్రధానంగా ప్రావిన్స్(రాష్ట్రాల)కు నాయకత్వం వహించే నేతలు షరియత్ చట్టాలనే ఆయుధాలుగా జనంపై కర్కషంగా విరుచుకుపడతారు. అంతటితో వాళ్లు ఆగిపోరు, మహా అయితే మరో ఏడాదిలోనే తాలిబన్లు భారత్ పై దాడికి దిగుతారు. ఆ దిశగా పాకిస్తాన్, చైనాలు వారిని ఉసిగొల్పుతాయి. అందుకే భారత్ తప్పనిసరిగా తాలిబన్లతో యుద్దం చేయాలి. అది..

భరతమాత కోసమైనా మోదీ యుద్ధానికి..
అఫ్గాన్ లో తాలిబన్ రాజ్యం గురించి భారత్ తన వ్యూహాలను వేగంగా మార్చుకోవాల్సిన అవసరత ఏర్పడింది. ఆ దేశంలో తాలిబన్ వ్యతిరేక గ్రూపులు, శక్తులు అన్నిటికీ భారత్ అండగా నిలబడాలి. తాలిబన్లను వ్యతిరేకించే నాయకులకు భారత్ లో ఆశ్రయం కల్పించారు. అలాంటి నేతలను ఒక్కటిగా చేసి భారత్ నుంచే ఆపరేట్ అయ్యేలా అఫ్గానిస్థాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో కలిపేస్తామన్నది బీజేపీ ప్రభుత్వ విధానమే కాబట్టి, ముందుగా మనం పీఓకేను స్వాధీనం చేసుకున్న తర్వాత అఫ్గానిస్థాన్ తో సుదీర్ఘమైన సరిహద్దు కలిగుంటాం. అప్పుడు నేరుగా భారత సైన్యాన్ని రంగంలోకి దింపి తాలిబన్లను ఏరిపారేయొచ్చు. తాలిబన్లతో యుద్దం దిశగా ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకోవాలి. అఖండ భారత్ కావాలని కలగనే మనం భరతమాత కోసం ఇది తప్పక చేయాల్సిందే..''అని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి అన్నారు. కొద్ది గంటల కిందట, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కీలక నేత రామ్ మాధవ్ కూడా అఫ్గానిస్థాన్-తాలిబన్ల విషయంలో భారత ప్రభుత్వం తన వ్యూహాలను వేగంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని వక్కాణించడం గమనార్హం. అయితే, యుద్ధమే చేయాలని రామ్ మాధవ్ నేరుగా చెప్పలేదు. బీజేపీలో కట్టర్ హిందూవాదిగా ముద్రపడిన సుబ్రమణ్యస్వామి డిమాండ్ పై కేంద్రంగానీ, సొంత పార్టీగానీ స్పందించాల్సి ఉంది. రాబోయే ఎన్నికల్లో లబ్ది కోసం మోదీ సర్కార్ ఇలాంటి తప్పు చేయరాదని, అమెరికా చేసిన తప్పులను భారత్ చేయబోదని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications