నటికి చేదు అనుభవం.. పిజ్జా డెలివరీ బాయ్ నిర్వాకంతో నరకం..
ఓ పిజ్జా డెలివరీ బాయ్ తన సెల్ఫోన్ నంబర్ను వాట్సాప్ అడల్ట్ గ్రూపుల్లో షేర్ చేశాడని తమిళ నటి గాయత్రి సాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొద్దిరోజులుగా తన సెల్ఫోన్కు విపరీతమైన ఫోన్లు,వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయని.. అసభ్యకర పదజాలంతో తనను వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్లోనూ షేర్ చేసి ఆవేదన వ్యక్తం చేశారు.
అసలేం జరిగింది..
ఫిబ్రవరి 9న నటి గాయత్రి సాయి డోమినోస్ నుంచి పిజ్జా ఆర్డర్ చేశారు. కాసేపటికి పిజ్జా డెలివరీ బాయ్ వచ్చి డోర్ కొట్టాడు. వెళ్లి ఆర్డర్ తీసుకున్న గాయత్రి.. అతను మద్యం మత్తులో ఉండటాన్ని గమనించింది. అదే రోజు నుంచి ఆమె సెల్ఫోన్కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి విపరీతమైన కాల్స్,మెసేజ్లు రావడం మొదలైంది.వారంతా ఆమెతో అసభ్యకరంగా మాట్లాడుతుండటంతో ఆమె విసుగెత్తిపోయారు. నిమిషాల వ్యవధిలో కాల్స్ మీద కాల్స్ రావడంతో నరకం అనుభవించారు.

ఇలా బయటపడింది
తన వాట్సాప్ నంబర్కు అసభ్యకర మెసేజ్ చేసిన ఓ వ్యక్తిని గాయత్రి గట్టిగా నిలదీసింది. ఫోన్ నంబర్ ఎవరిచ్చారని ప్రశ్నించింది. దీంతో పిజ్జా డెలివరీ బాయ్ అడల్ట్ గ్రూపుల్లో ఆమె నంబర్ షేర్ చేసినట్టు వెల్లడించాడు. షాక్ తిన్న నటి తేనాంపేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అడల్ట్ గ్రూప్ వ్యక్తుల నుంచి తనకు వస్తున్న మెసేజ్లకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ వారికి ఇచ్చింది. ఆ స్క్రీన్ షాట్స్తో పాటు సదరు పిజ్జా డెలివరీ బాయ్ ఫోటోను కూడా ట్విట్టర్లో షేర్ చేసింది.

నిందితుడి అరెస్ట్..
తనకు ఎదురవుతున్న వేధింపుల నుంచి బయటపడేలా తమిళనాడు పోలీసులు సాయం చేయాలని ట్విట్టర్లో గాయత్రి కోరారు. గాయత్రి ట్వీట్ తర్వాత పోలీసులు కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు.పిజ్జా డెలివరీ బాయ్ను అదుపులోకి తీసుకున్నామని, విచారణ కొనసాగుతుందని తెలిపారు. అడల్ట్ గ్రూపుల వ్యవహారాన్ని కూడా బయటకు లాగుతామని చెప్పారు. కాగా, నటి గాయత్రి ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన అంజలి చిత్రంతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళంలో పలు చిత్రాల్లో నటించారు.

వాట్సాప్ గ్రూపులపై నిఘా..
వాట్సాప్ అడల్ట్ గ్రూపుల్లో నటి నంబర్ షేర్ చేయడంతో.. ఈ గ్రూపులపై చర్చ జరుగుతోంది. వీటి ద్వారా అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. వెలుగుచూడని వేధింపులు ఎక్కువే ఉండవచ్చునని భావిస్తున్నారు. మరోవైపు ఇలాంటి ఘటనలపై మహిళ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సైబర్ క్రైమ్ చట్టాలను మరింత పకడ్బందీగా అమలుచేయాలని.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications