తమిళనాడు సర్కార్ మరో సంచలన నిర్ణయం ... ప్రభుత్వోద్యోగాలకు తమిళ పరీక్ష తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు
భారతదేశంలో భాషాభిమానం ఎక్కువగా ఉన్న రాష్ట్రం గురించి చెప్పాలంటే ఠక్కున ప్రతి ఒక్కరూ తమిళనాడు గురించి చెప్తారు. తమిళులకు ఎనలేని భాషాభిమానం ఉందని అనేక సందర్భాల్లో వ్యక్తమైంది . ఇటీవల తమిళంలో మాట్లాడిన వినియోగాదారుడితో హిందీ నేర్చుకోమని చెప్పిన జొమాటో ఏజెంట్ కు ఓ తమిళ తంబి ఘోరంగా షాక్ ఇచ్చారు. ఏకంగా జొమాటోని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. హిందీ జాతీయ భాష కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జోమాటో సంస్థ దిగొచ్చి క్షమాపణ చెప్పక తప్పలేదు.
భాష విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న తమిళనాడు రాష్ట్రం
తమిళులు తమ భాషను ఎవరైనా చిన్న చూపు చూసినా సహించరని దేశమంతా తెలుసు. ఇప్పటికే తమిళ నాడు రాష్ట్రంలో అనేక ప్రభుత్వ శాఖలలో తమిళంలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగించే సాంప్రదాయం ఎప్పటి నుండో ఉంది. విపరీతమైన భాషాభిమానం ప్రదర్శించే తమిళనాడు రాష్ట్రంలో తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. భాషకు తాజా నిర్ణయంతో మరోమారు పట్టం కట్టింది తమిళనాడు ప్రభుత్వం. భాషకు వారిచ్చే ప్రాధాన్యతను చెప్పింది.
ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే తమిళ పరీక్ష తప్పనిసరి చేసిన రాష్ట్రం
అభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చే సర్కార్ తాజాగా భాషకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు రాష్ట్రంలో ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలంటే కచ్చితంగా వారు తమిళం పరీక్షను రాసి పాస్ అవ్వాల్సిందే. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వ సేవలు మరియు ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రవేశానికి తమిళ పరీక్షకు అర్హతను తప్పనిసరి చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొంది.
తమిళ భాషా పరీక్షలో కనీసం 40% మార్కులు సాధించడం తప్పనిసరి
రాష్ట్ర రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే పోటీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరికీ తమిళ పరీక్షను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తమిళనాడు సర్కార్. తమిళనాడు రాష్ట్ర ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ చెప్పిన వివరాల ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి విద్యార్థి ఈ పరీక్షలో కనీసం 40% మార్కులు సాధించడం తప్పనిసరి" అని ఆయన అన్నారు. ఈ కొత్త విధానం సామాజిక న్యాయం ప్రబలేందుకు దోహదపడుతుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రిక్రూట్మెంట్ ప్రక్రియలో ప్రాధాన్యత ఇవ్వబడుతుందని ఆయన పేర్కొన్నారు
తమిళ భాషలో ఫెయిల్ అయితే ఉద్యోగం కష్టమే
అర్హత గల తమిళ భాషా పేపర్లో అర్హత సాధించకపోతే, మొత్తం పరీక్ష ప్లాన్ లో భాగమైన ఇతర సబ్జెక్ట్ పేపర్లు, ఆర్డర్ ప్రకారం మూల్యాంకనం కోసం తీసుకోబడవని వెల్లడించారు. టీచర్స్ రిక్రూట్మెంట్ బోర్డ్, మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్, తమిళనాడు యూనిఫాండ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ మరియు తమిళనాడు ఫారెస్ట్ యూనిఫాండ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ కమిటీతో సహా ఇతర రాష్ట్ర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఇలాంటి మార్గదర్శకాలను విడుదల చేస్తాయని స్పష్టం చేశారు.
తమిళనాడు సర్కార్ తీసుకున్న నిర్ణయంతో భాషకు ప్రాధాన్యం
అంతేకాదు తమిళనాడులో ఎనిమిది కోట్ల మందికి తొమ్మిది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఏది ఏమైనా తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భాషకు మరింత ప్రాధాన్యతను కల్పిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. ప్రతి రాష్ట్రం ఇలా భాషకు ప్రాధాన్యతనిస్తూ నిర్ణయాలు తీసుకుంటే భాషల ఉనికి ప్రశ్నార్థకం కాకుండా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.