పన్నీర్ సెల్వంకు చెమటలు: మనం ఏం చేద్దాం, ఎందుకిలా ?
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నేతృత్వంలో అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తమిళనాడుకు చెందిన సీనియర్ మంత్రులు పాల్గొన్నారు.
చెన్నై: తమిళనాడులో వరుసగా ఆదాయ పన్ను శాఖ (ఐటీ) అధికారులు దాడులు చెయ్యడంతో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ఉలిక్కిపడింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం ఏం చెద్దాం అంటూ అధికార పార్టీ నాయకులు ఆలోచనలో పడ్డారు.
గురువారం తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నేతృత్వంలో అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తమిళనాడుకు చెందిన సీనియర్ మంత్రులు పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై మనం ఏం చెద్దాం ? అని పన్నీర్ సెల్వం చర్చించారు.
మొదట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తూ ఐటీ శాఖ అధికారుల వలలో పడిన రామ్మోహన్ రావును ఆ పదవి నుంచి తొలగించాలని నిర్ణయించారు. ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి గిరిజా వైద్యనాథన్ ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
రామ్మోహన్ రావు మీద కేసు నమోదు అయితే దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుందని సమాచారం. అయితే అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీకి అత్యంత సన్నిహితుడైన శేఖర్ రెడ్డి మీద సీబీఐ విచారణకు పూర్తిగా సహకరించాలని కొందరు నాయకులు పట్టుబడ్డారని తెలిసింది.
మొత్తం మీద మెజారీ మంత్రుల నిర్ణయానికి పన్నీర్ సెల్వం సరే ! అన్నారని సమాచారం. అయితే శేఖర్ రెడ్డి సీబీఐ ముందు నోరువిప్పితే ఎంత మంది నాయకుల అసలు బండారం బయటపడుతుంది ? అనే విషయం ఇప్పట్లో తెలిసేటట్లు లేదు.
ఇప్పటికే సీఎం సీటు కాపాడుకోవడానికి పన్నీర్ సెల్వంతో పాటు ఆయన వర్గీయులు నానాతంటాలు పడుతుంటే ఒక్క సారిగా ఐటీ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. ప్రతిపక్షాలు దెమ్మెత్తిపోయడంతో అన్నాడీఎంకే ప్రభుత్వం రామ్మోహన్ రావు మీద వేటు వేసింది. ఇప్పుడు అధికారికంగా విచారణకు ఆదేశాలు జారీ చెయ్యాలని ఓ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.