అక్రమ ఆస్తులు: ఊపిరిపీల్చుకున్న జయలలిత
న్యూఢిల్లీ: అక్రమ ఆస్తులు సంపాధించారని ఆరోపణలు ఎదుర్కోంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత ఊపిరిపీల్చుకున్నారు. అక్రమాస్తుల కేసు 2016 ఫిబ్రవరి 2వ తేది విచారణ చేపడతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
సోమవారం సుప్రీం కోర్టులో జయలలిత అక్రమాస్తుల కేసు అర్జీ విచారణ జరిగింది. ఈ సందర్బంలో కర్ణాటక ప్రభుత్వం, డీఎంకే నాయకుడు అన్బళగన్, జయలలిత తరుపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
కేసు వివరాలు తెలుసుకున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తులు కేసు విచారణ ఫిబ్రవరి 2 వ తేది నుంచి రోజు మార్చి రోజు విచారణ చేపడతామని స్పష్టం చేశారు. ఈ తేదీలలో ఎలాంటి మార్పులు ఉండవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
ఫిబ్రవరి వరకు సమయం చిక్కడంతో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఊపిరిపీల్చుకున్నారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఆమె ప్రాణస్నేహితురాలు శశికళా నటరాజన్, ఇళవరసి, సుధాకర్ లు నిర్దోషులుగా విడుదల అయ్యారు.
కర్ణాటక హై కోర్టు న్యాయమూర్తి సీ.ఆర్. కుమారస్వామి 2015 మే 11వ తేది ఈ కేసును కొట్టి వేస్తూ జయలలితతో పాటు అందరూ నిర్దోషలు అంటూ తీర్పు చెప్పారు. డీఎంకే నాయకుడు అన్బళగన్ కర్ణాటక హై కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ఇదే సమయంలో హై కోర్టు తీర్పును సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో 4,000 పేజీలతో అర్జీ సమర్పించింది. హై కోర్టు తీర్పును కొట్టి వేసి ప్రత్యేక కోర్టు విధించిన నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 100 కోట్ల జరిమానా విధించిన తీర్పును అమలు చెయ్యాలని కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో మనవి చేసింది.
జయలలిత న్యాయవాదులు సైతం సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. కర్ణాటక హై కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చెయ్యాలని మనవి చేశారు. కేసు పూర్తి వివరాలు తెలుసుకున్న అత్యున్నత న్యాయస్థానం ఫిబ్రవరి 2 నుంచి కేసు విచారణ చేపట్టనుంది.